
సాధారణంగా టీనేజ్ పిల్లలు సమ్మర్ హాలీడేస్ రాగానే టూర్లు, లాంగ్ ట్రిప్పులకు ప్లాన్ వేస్తుంటారు. కానీ.. ఈ ఇద్దరు మాత్రం వాళ్ల ఇంటర్ పరీక్షలు రాయగానే సరదాగా ఓ యూట్యూబ్ చానెల్ మొదలుపెట్టారు. అందులో ఐపీఎల్ మీద వీడియోలు చేశారు. అలా సరదా కోసం మొదలుపెట్టిన చానెల్కు ఇప్పుడు తొమ్మిదిన్నర లక్షలమంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. దాని ద్వారా ఇద్దరూ ప్రతి నెలా లక్షల్లో సంపాదిస్తున్నారు.
ఐపీఎల్ సీజన్ మొదలైందంటే చాలు.. యువకుల్లో క్రికెట్ మీద చర్చ మొదలైపోతుంది. ఏ టీం గెలుస్తుంది? ఎవరు బాగా ఆడుతున్నారు?.. ఇలాంటి విషయాల మీద గంటల తరబడి మాట్లాడుకుంటుంటారు. ముంబైకి చెందిన అభ్యుదయ మోహన్, గౌతమి కవాళే కూడా అలాంటివాళ్లే. మోహన్ 1998 జనవరి 2న పుట్టాడు. గౌతమి 1998 అక్టోబర్ 29న పుట్టింది. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. కాలేజీలో మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు యూట్యూబ్ గురించి చర్చకు వచ్చింది. దాంతో సరదాగా ఒక యూట్యూబ్ చానెల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.
సిల్లీ పాయింట్గా మొదలై..
మోహన్, గౌతమి 2016లో ఇంటర్ పరీక్షలు రాసిన వెంటనే సమ్మర్ సెలవుల్లో ‘సిల్లీ పాయింట్’ పేరుతో ఒక యూట్యూబ్ చానెల్ పెట్టారు. ఇండియాలో ఎక్స్క్లూజివ్గా క్రికెట్ మీద మాత్రమే కంటెంట్ చేసే మొదటి చానెల్ ఇది. గౌతమి క్రికెట్కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు పేపర్ మీద రాసుకుని జనాలు ఎక్కువగా ఉండే ప్లేస్లకు వెళ్లేది. ర్యాండమ్గా కొంతమందిని సెలక్ట్ చేసి, వాళ్ల ముందు మైక్ పెట్టి ఆ ప్రశ్నలు అడిగేది.
ఆ వీడియోలను యూట్యూబ్లో పోస్ట్ చేసేవాళ్లు. కానీ.. ఆ కంటెంట్కు ఆశించిన స్థాయిలో రీచ్ రాలేదు. దాంతో కామెడీ, సినిమా రివ్యూలు, సెటైరికల్, అవేర్నెస్ వీడియోలు చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే 2017లో చానెల్ పేరుని ‘స్లే పాయింట్’గా మార్చారు. ఆ తర్వాత కామెడీ వీడియోలు చేశారు. వాటికి మంచి రీచ్ రావడమే కాకుండా చానెల్కు సబ్స్క్రయిబర్ల సంఖ్య కూడా పెరిగింది. తర్వాత కామెంట్ల ద్వారా వ్యూయర్స్ ఇష్టాయిష్టాలను అర్థం చేసుకుని, అందుకు తగ్గట్టు మిల్లెనియల్, జెన్-జెడ్లను ఆకర్షించే కంటెంట్ మీద దృష్టి పెట్టారు.
బినోద్ మీమ్తో పాపులర్
చానెల్లో 2019లో వాళ్లు ‘‘వై ఇండియన్ కామెంట్స్ సెక్షన్ ఈజ్ గార్బేజ్ (బినోద్)” పేరుతో ఒక వీడియో చేశారు. అందులో వాళ్ల వీడియోలకు బినోద్ థరూ అనే ఒక వ్యూయర్ తన పేరు “బినోద్” అని మాత్రమే కామెంట్ చేయడం గురించి అభ్యుదయ, గౌతమి కామెడీగా మాట్లాడారు. వాళ్లు మాట్లాడే విధానం, కామెడీ టైమింగ్ అందరికీ నచ్చింది. దాంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. అంతేకాదు.. ‘‘బినోద్” పేరుతో చాలా మీమ్స్ వచ్చాయి. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ “బినోద్” అనే పదం విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఆ ఒక్క వీడియో వల్ల కొన్ని లక్షల మంది చానెల్ని సబ్స్క్రయిబ్ చేసుకున్నారు.
ఆ వీడియోకు 17 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. పైగా “బినోద్” మీమ్ ఇప్పటికీ ఇంటర్నెట్లో షేర్ అవుతోంది. అంతేకాదు.. కొంతమంది వ్యూయర్స్ హిందీలోని టాప్ చానెల్స్లో పెట్టే వీడియోలకు కూడా ‘బినోద్’ అని కామెంట్ చేయడం మొదలుపెట్టారు. కొందరైతే నాసా లాంటి సంస్థల లైవ్ స్ట్రీమ్లలో కూడా “బినోద్” అని కామెంట్లు పెట్టారు. దాంతో స్లే పాయింట్ చానెల్ గురించి అందరికీ తెలిసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని “హూ క్రియేటెడ్ ఈజ్ బినోద్?” అనే ఫాలో-అప్ వీడియో చేశారు. అందులో ఈ ట్రెండ్కు సంబంధించిన విషయాలు పంచుకున్నారు అభ్యుదయ, గౌతమి.
స్లే పాయింట్లో అప్లోడ్ చేసే కంటెంట్ ప్రధానంగా హిందీ, ఇంగ్లీష్లోనే ఉంటుంది. కానీ.. వాళ్ల కామెడీ, ఎంచుకునే అంశాల వల్ల తెలుగు వ్యూయర్స్ని కూడా ఆకర్షించారు. ప్రస్తుతం వాళ్లు భారతీయ సంస్కృతి, బాలీవుడ్, డైలీ రొటీన్ వ్లాగ్స్ లాంటివి చేస్తున్నారు.
మరో రెండు చానెళ్లు
ప్రస్తుతం ‘స్లే పాయింట్’ చానెల్ను 9.47 మిలియన్ల మంది సబ్స్క్రయిబ్ చేసుకున్నారు. ఇందులో పది మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చిన వీడియోలు చాలానే ఉన్నాయి. ఈ చానెల్లో కేవలం లాంగ్ ఫార్మాట్ వీడియోలు మాత్రమే అప్లోడ్ చేస్తున్నారు. షార్ట్ ఫార్మాట్ వీడియోల కోసం ప్రత్యేకంగా ‘స్లే షార్ట్స్’ పేరుతో మరో చానెల్ నడుపుతున్నారు. అయితే.. ‘స్లే పాయింట్’కి టైం పాస్ వెర్షన్గా 2017లో ‘సిల్లీ పాప్’ అనే మరో చానెల్ని కూడా క్రియేట్ చేశారు. దీన్ని ఇప్పటివరకు 2.84 మిలియన్ల మంది సబ్స్క్రయిబ్ చేసుకున్నారు. ఇందులో ప్రస్తుతం 117 వీడియోలు ఉన్నాయి.