ఇండియా-బి టీమ్‌‌కూ మస్త్‌‌ పోటీ!

ఇండియా-బి టీమ్‌‌కూ మస్త్‌‌ పోటీ!
  • రేసులో పాతిక మంది ప్లేయర్లు
  • లంక టూర్‌‌‌‌కు అనేక ఆప్షన్స్‌‌‌‌

మరికొన్ని రోజుల్లో ఇండియా క్రికెట్ ఫ్యాన్స్‌‌‌‌కు డబుల్ కిక్‌‌‌‌ లభించనుంది..!  ఓవైపు విరాట్‌‌‌‌ కోహ్లీ కెప్టెన్సీలోని టెస్టు టీమ్.. వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ తర్వాత, ఇంగ్లండ్‌‌‌‌తో సిరీస్‌‌‌‌ కోసం ప్రిపరేషన్స్‌‌‌‌ కొనసాగిస్తుండగా.. మరోవైపు ఓ కొత్త కెప్టెన్‌‌‌‌ సారథ్యంలోని వైట్‌‌‌‌బాల్‌‌‌‌ టీమ్‌‌‌‌.. శ్రీలంకలో వన్డే, టీ20ల్లో బరిలోకి దిగనుంది..! 20 మంది మెయిన్‌‌‌‌, నలుగురు స్టాండ్‌‌‌‌బై ప్లేయర్లు ఇంగ్లండ్‌‌‌‌ గడ్డపై ఉండగానే.. లంక సిరీస్‌‌‌‌ కోసం ఓ పాతిక మంది వెయిటింగ్‌‌‌‌లో ఉన్నారు..! గతంలో నేషనల్‌‌‌‌ టీమ్‌‌‌‌కు ఆడే అర్హత, సత్తా ఉన్న ప్లేయర్లను వెతుక్కున్న సందర్భాలను అధిగమించి.. ఒకే టైమ్‌‌‌‌లో రెండు జట్లను బరిలోకి దింపే స్థాయికి మన వనరులు పెరిగాయి..! డొమెస్టిక్‌‌‌‌ క్రికెట్‌‌‌‌, ఐపీఎల్‌‌‌‌తో వెలుగులోకి వచ్చిన ఎంతో మంది యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌.. ఇప్పుడు ఇండియా–బి టీమ్‌‌‌‌ కోసం పోటీపడుతున్నారు..! దీంతో టీమ్‌‌‌‌లో ఉండే అన్ని ప్లేస్‌‌‌‌లకు విపరీతమైన ఆప్షన్స్‌‌‌‌ అందుబాటులోకి రావడంతో సెలెక్టర్లకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి..!!

వెలుగు స్పోర్ట్స్‌‌‌‌ డెస్క్‌‌‌‌: యావత్‌‌‌‌ ప్రపంచంతో పాటు సాఫీగా సాగిపోతున్న క్రికెట్‌‌‌‌ను కరోనా చాలా దెబ్బకొట్టింది.  ప్రాణాంతక వైరస్‌‌‌‌ కారణంగా గతేడాది చాలా మ్యాచ్‌‌‌‌లు, టోర్నీలు రద్దయ్యాయి. కొన్ని వాయిదా కూడా పడ్డాయి. ఐసీసీ.. ఎఫ్‌‌‌‌టీపీ (ఫ్యూచర్‌‌‌‌ టూర్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ప్రోగ్రామ్స్‌‌‌‌) కూడా దెబ్బతిన్నది. సాధారణంగా ప్రతీ టీమ్‌‌‌‌ దాదాపు రెండేళ్ల వ్యవధిలో ఆడే టోర్నీల షెడ్యూల్‌‌‌‌ను ముందే ఖరారు చేస్తారు. కానీ కరోనా కారణంగా 2020 సీజన్‌‌‌‌ సగం కూడా పూర్తి కాలేదు. టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లాంటి మెగా టోర్నీలు కూడా వైరస్‌‌‌‌ దెబ్బకు వాయిదాపడ్డాయి. ఇక టీమిండియా ఆడాల్సిన పలు సిరీస్‌‌‌‌లు కూడా ఎఫెక్ట్‌‌‌‌ అయ్యాయి. అయితే ఎఫ్‌‌‌‌టీపీలో భాగమైన ఈ సిరీస్‌‌‌‌లన్నింటినీ కంప్లీట్‌‌‌‌ చేయాలంటే బీసీసీఐ ఏకకాలంలో రెండు నేషనల్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ను బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేసింది. ఈ ఆలోచన జులైలో నిజం కాబోతున్నది. గతంలో ఆస్ట్రేలియా ఒకేసారి రెండు జట్లను ఆడించగా, ఇప్పుడు మనోళ్లు కూడా ఏక కాలంలో రెండు దేశాలతో పోటీపడేందుకు రెడీ అవుతున్నారు. విరాట్‌‌‌‌ కోహ్లీ నేతృత్వంలోని మెయిన్‌‌‌‌ టీమ్‌‌‌‌.. ఇంగ్లండ్‌‌‌‌లో ఐదు టెస్ట్‌‌‌‌లు సిరీస్‌‌‌‌ కోసం ప్రిపేర్‌‌‌‌ అయ్యే టైమ్‌‌‌‌లోనే, ఇండియా–బి టీమ్‌‌‌‌ లంక టూర్‌‌‌‌లో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఇలా ఒకేసారి రెండు జట్లతో కొత్త ప్రయోగానికి తెరలేపిన బీసీసీఐ.. లంక టూర్‌‌‌‌కు ఎలాంటి టీమ్‌‌‌‌ను ప్రకటిస్తుందన్న  ఆసక్తి ఫ్యాన్స్‌‌‌‌లో పెరిగిపోయింది. ఆయా డిపార్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌లో అందుబాటులో ఉన్న ప్లేయర్లలో.. ఎవరికి మొగ్గు ఉందో చూద్దాం. 

టాపార్డర్‌‌‌‌
ఆప్షన్స్‌‌‌‌: శిఖర్​ధవన్‌‌‌‌, పృథ్వీ షా, సంజు శాంసన్‌‌‌‌, సూర్యకుమార్​యాదవ్, దేవదుత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌, రుతురాజ్​ గైక్వాడ్‌‌‌‌, మనీశ్​ పాండే, ఇషాన్​ కిషన్.

ధవన్, పృథ్వీ  తప్పితే మిగతా టాపార్డర్​ బ్యాట్స్‌‌‌‌మెన్​ మిడిలార్డర్​లో కూడా ఫిట్​అవుతారు. అయితే ఓపెనింగ్​ స్లాట్స్​కోసం సెలెక్టర్ల ముందు చాలా ఆప్షన్స్​ఉన్నాయి. కోహ్లీ, రోహిత్​ శర్మ లేని టైమ్‌‌‌‌లో శిఖర్ బ్యాటింగ్‌‌‌‌లో కీలకం కానున్నాడు. ఐసీసీ ఈవెంట్లలో అదరగొట్టే ఈ ఢిల్లీ డాన్‌‌‌‌.. గత మూడేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ ఓపెనర్​గా ఐపీఎల్​లో సత్తా చాటుతున్నాడు. అతని ఓపెనింగ్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌గా  షా, పడిక్కల్​పోటీ పడుతున్నారు. లాస్ట్ ఐపీఎల్‌‌‌‌తో పాటు ఆసీస్​టూర్‌‌‌‌లో  చెత్తాటతో ఇండియా టెస్ట్‌‌‌‌ టీమ్‌‌‌‌లో చోటు కోల్పోయిన పృథ్వీ ఈ ఐపీఎల్‌‌‌‌తో మళ్లీ ఫుల్​ ఫామ్​లోకి వచ్చాడు. అంతకుముందు  విజయ్​ హజారే వన్డే ట్రోఫీలో పలు రికార్డులు బద్దలు కొడుతూ పరుగుల మోత మోగించాడు. దేవదత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌ కూడా అంతే.  విజయ్​ హజారే ట్రోఫీలో ఇరగదీసిన తను ఐపీఎల్‌‌‌‌లో ఆర్‌‌‌‌సీబీ తరఫున సూపర్ ఫెర్ఫామెన్స్​ చేశాడు. తన టెక్నిక్, దూకుడైన స్ట్రోక్స్‌‌‌‌తో క్రికెట్ ఎక్స్‌‌‌‌పర్ట్స్​ను ఇంప్రెస్ చేసిన అతను  ఓ సెంచరీ కూడా కొట్టాడు. సూర్యకుమార్, ఇషాన్​, శాంసన్‌‌‌‌, సీనియర్​ మనీశ్​ పాండేతో మిడిలార్డర్​లో ఎలాంటి సమస్య లేదు. శాంసన్, కిషన్‌‌‌‌ ఇద్దరూ వికెట్‌‌‌‌ కీపర్లుగా పనికొస్తారు. 

ఫాస్ట్‌‌‌‌ బౌలర్లు
ఆప్షన్స్: భువనేశ్వర్​ కుమార్, నవదీప్​ సైనీ, దీపక్‌‌‌‌ చహర్, జైదేవ్​ ఉనాద్కట్, ఖలీల్​ అహ్మద్​, హర్షల్​ పటేల్, చేతన్ సకారియా.

గాయం, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సమస్యలు లేకపోతే.. లంక టూర్​లో ఇండియా బౌలింగ్‌‌‌‌ను సీనియర్ పేసర్​ భువనేశ్వర్​ కుమార్ నడిపించనున్నాడు. దీపక్‌‌‌‌ చహర్, నవదీప్‌‌‌‌ సైనీకి కూడా చోటు గ్యారంటీ అనొచ్చు. ఆర్‌‌‌‌సీబీ టీమ్‌‌‌‌లో సూపర్​ ఫామ్​లో ఉన్న సిరాజ్ కారణంగా ఐపీఎల్‌‌‌‌లో ఎక్కువ  చాన్స్​లు రాకపోయినా  సైనీలో వన్డేలకు పనికొచ్చే  మంచి పేస్‌‌‌‌, స్కిల్స్​ఉన్నాయి. టీ20ల మాదిరిగా పవర్​ప్లేలో బౌలింగ్‌‌‌‌ బాధ్యతను దీపక్‌‌‌‌ పంచుకోగలడు.  మోకాలికి సర్జరీతో నటరాజన్‌‌‌‌ టీమ్‌‌‌‌కు దూరం కాగా, లెఫ్టార్మ్​ ​ పేసర్ గా  ఖలీల్‌‌‌‌ అహ్మద్, జైదేవ్​లో​ఒకరిని సెలెక్టర్లు ఎంచుకోవచ్చు.  గత రంజీ సీజన్‌‌‌‌లో రికార్డు స్థాయిలో 67 వికెట్లు పడగొట్టి సౌరాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించిన జైదేవ్​ వైపు మొగ్గుంది. ఐపీఎల్‌‌‌‌ –14లో అదరగొట్టిన ఇద్దరు యువ పేసర్లు హర్షల్​పటేల్, చేతన్ సకారియాలో ఒకరిని వైల్డ్‌‌‌‌ కార్డ్‌‌‌‌ ఎంట్రీగా టీమ్‌‌‌‌లోకి తీసుకున్నా ఆశ్చర్యం లేదు.

స్పిన్నర్లు
ఆప్షన్స్‌‌‌‌: యుజ్వేంద్ర చహల్, కుల్దీప్‌‌‌‌ యాదవ్, రాహుల్ చహర్, వరుణ్ చక్రవర్తి.

చహల్, కుల్దీప్‌‌‌‌ ఫామ్​ కోల్పోవడంతో గత రెండేళ్లుగా వైట్‌‌‌‌బాల్​క్రికెట్‌‌‌‌లో ఇండియా స్పిన్ డిపార్ట్​మెంట్‌‌‌‌ వీక్‌‌‌‌గా మారింది. ఇది 2019 వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో టీమ్‌‌‌‌ అవకాశాలను దెబ్బకొట్టింది. ఓవైపు కుల్దీప్ నేషనల్ టీమ్‌‌‌‌తో పాటు ఐపీఎల్‌‌‌‌ కేకేఆర్​తరఫున అరుదుగా ఆడగా, చహల్‌‌‌‌లో నిలకడ లోపించింది. అతని బాల్స్‌‌‌‌ ఈజీగా అర్థం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లాంగ్‌‌‌‌టర్మ్‌‌‌‌  ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సెలెక్టర్లు రాహుల్ చహర్​, మిస్టరీ స్పిన్నర్​ వరుణ్​ చక్రవర్తి వైపు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. ఐపీఎల్‌‌‌‌ ద్వారా టఫ్‌‌‌‌ సిచ్యువేషన్స్‌‌‌‌లో ప్రెజర్​ను హ్యాండిల్‌‌‌‌ చేయగలనని నిరూపించుకున్న చహర్.. సొంతగడ్డపై  ఇంగ్లండ్‌‌‌‌తో టెస్టు సిరీస్‌‌‌‌లో రిజర్వ్‌‌‌‌ బౌలర్​గా వ్యవహరించాడు. మరోవైపు ఆస్ట్రేలియా టూర్, ఇంగ్లండ్‌‌‌‌తో టీ20 టీమ్స్​కు ఎంపికైనా ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌లో ఫెయిలైన చక్రవర్తికి మూడో చాన్స్‌‌‌‌ దొరకొచ్చు. క్రునాల్‌‌‌‌ పాండ్యాతో పాటు తను సెకండ్ ఆఫ్​ స్పిన్నర్​ ఆప్షన్​గా పని కొస్తాడు.  ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ ఇష్యూస్‌‌‌‌, భుజం గాయం నేపథ్యంలో వరుణ్‌‌‌‌ను టీ20లకు మాత్రమే పరిగణనలోకి తీసుకోవచ్చు.  

ఆల్‌‌‌‌రౌండర్స్​
ఆప్షన్స్: హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, రాహుల్ తెవాటియా, దూబే, విజయ్‌‌‌‌ శంకర్.

ఆల్‌‌‌‌రౌండర్ల ఎంపికే సెలెక్టర్లకు కాస్త సవాల్ కానుంది. ఎందుకంటే హార్దిక్​ పాండ్యా  నెలకంటే ఎక్కువ కాలం బౌలింగ్ చేయగలడా?  అన్‌‌‌‌క్యాప్డ్‌‌‌‌ లెగ్‌‌‌‌ స్పిన్ ఆల్‌‌‌‌రౌండర్​ రాహుల్‌‌‌‌ తెవాటియా బిగ్గెస్ట్‌‌‌‌ స్టేజ్‌‌‌‌కు పనికొస్తాడా? లేదంటే శివం దూబే, విజయ్‌‌‌‌ శంకర్​లకు మరో చాన్స్‌‌‌‌ ఇవ్వాలా? అనే ప్రశ్నలకు సమాధానం వెతకాలి. ప్రస్తుతానికి రవీంద్ర జడేజా, హార్దిక్ రూపంలో మన టీమ్‌‌‌‌కు ఇద్దరు బెస్ట్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్లు ఉన్నారు. వీళ్లు టీ20 వరల్డ్​కప్​లో ఆడడం కూడా ఖాయమే. అయితే  శ్రీలంక సిరీస్‌‌‌‌ ద్వారా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ టీమ్‌‌‌‌కు మరికొన్ని ఆప్షన్లు పెరిగే అవకాశం ఉంది.