- డిజిటల్ ఫైనాన్సింగ్ కంపెనీలపై మస్తు కంప్లయింట్లు
- ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వర్ రావు
- ఇలాగే కొనసాగితే ...ఫిన్టెక్ కంపెనీలపై నమ్మకం పోతుంది
వెలుగు బిజినెస్ డెస్క్: డిజిటల్ విధానంలో అప్పులు ఇస్తున్న కంపెనీలపై కంప్లయింట్లు వెల్లువెత్తుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు వెల్లడించారు. ఇటీవలి కాలంలో వేగంగా ఎదుగుతున్న ఈ ఇండస్ట్రీపై ఆయన కామెంట్ గొడ్డలిపెట్టులాంటిదే. ప్రజలకు డిజిటల్ ఫైనాన్షియల్ కంపెనీలు మేలు చేస్తున్నాయనే విషయంలో ఎలాంటి డౌటూ లేదని, కానీ ఆ కంపెనీల నిర్వహణా పద్ధతులు, ప్రమాణాలు ఇబ్బందులు తెస్తున్నాయని రావు పేర్కొన్నారు. దీంతో ఫిన్టెక్ ఇండస్ట్రీపైనే నమ్మకం సడలే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. సీఐఐ–ఎన్బీఎఫ్సీ సమ్మిట్లో శుక్రవారం ఆయన ప్రసంగించారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారే జర్నీలో డిజిటల్ ఫైనాన్స్ పాత్ర అనే అంశంపై ఈ సమ్మిట్ను నిర్వహించారు.
అప్పుల రికవరీలో దురుసుతనం....
ఇచ్చిన అప్పుల వసూళ్లలో డిజిటల్ ఫైనాన్స్ కంపెనీలు కఠినమైన పద్ధతులు పాటిస్తున్నాయని, డేటా ప్రైవసీ పట్టించుకోవడం లేదని, మోసపూరిత ట్రాన్సాక్షన్లు, సైబర్ క్రైమ్, ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు పెరుగుతున్నట్లు కూడా రాజేశ్వర్ రావు చెప్పారు. అప్పుల రికవరీలో దురుసుగా ప్రవర్తిస్తున్నాయనే ఆరోపణలతోపాటు, డిజిటల్ ఫ్రాడ్స్పైనా ఇటీవల కంప్లయింట్లు పెరుగుతున్నాయి. గత కొన్నేళ్లలో దేశంలో ఫిన్టెక్ కంపెనీల సంఖ్య భారీగా పెరిగింది. అదేవిధంగా ఆ కంపెనీలు ఇచ్చే అప్పులు కూడా ఎక్కువయ్యాయి. ఇంక్ 42 ప్లస్ రిపోర్టు ప్రకారం దేశంలో 1,263 డిజిటల్ లెండింగ్ స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో 147 కంపెనీలలో వెంచర్ క్యాపిటల్ కంపెనీలు పెట్టుబడులు కూడా పెట్టాయి. 2014 నుంచి 2019–20 మధ్యలో వెంచర్ క్యాపిటల్ కంపెనీల పెట్టుబడులు 2.4 బిలియన్ డాలర్లు. ఇక ఇండియా ఫిన్టెక్ రిపోర్టు 2020 ప్రకారం చూస్తే దేశంలో 365 ఫిన్టెక్ కంపెనీలు కన్జూమర్ లెండింగ్, ఎస్ఎంఈ ఫైనాన్స్, పీ2పీ లెండింగ్ బిజినెస్లలో ఉన్నాయి. గోమెడిసి ఈ రిపోర్టును తెచ్చింది.
రూల్స్ పాటించాల్సిందే.....
డిజిటల్గా అప్పలు తీసుకున్న కస్టమర్ల కంప్లయింట్లను దృష్టిలో పెట్టుకుని జూన్ 2020లో ఆర్బీఐ ఒక సర్క్యులర్ జారీ చేసింది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలన్నీ మెరుగైన ప్రమాణాలను పాటించడంతోపాటు, గైడ్లైన్స్ను ఫాలో అవ్వాలని ఈ సర్క్యులర్లో ఆర్బీఐ పేర్కొంది. దేశంలోని ఎన్బీఎఫ్సీలు ఇనొవేటివ్ ఫిన్టెక్ ప్రొడక్టులను తేవడాన్ని మెచ్చుకుంటూనే, మరోవైపు ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని రాజేశ్వర్ రావు హెచ్చరించారు. రూల్స్కు భంగం కలిగించేలా ఎలాంటి చర్యలూ ఉండకూడదన్నారు. కస్టమర్ల కోసం తెచ్చే ఏ ఇనొవేషన్ని అయినా మెచ్చుకోవాల్సిందేనని చెబుతూ, కాకపోతే ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్పై అవి సానుకూల ప్రభావం చూపించేలా ఉండాలని సూచించారు. ఎన్బీఎఫ్సీ సెక్టార్ రెగ్యులేషన్స్ను మరింత పటిష్టం చేయడం పైనా ఆర్బీఐ పనిచేస్తోందని రావు
వెల్లడించారు.
ఎన్బీఎఫ్సీలకూ అంబుడ్జ్మన్
బ్యాంకింగ్లోలాగే ఎన్బీఎఫ్సీలకూ అంబుడ్జ్మన్ నియామకాన్ని ఇటీవలే అమలులోకి తెచ్చామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వర్ రావు చెప్పారు. తమ కంపెనీలో ఉండే సమస్యలను ఎన్బీఎఫ్సీలు తామే పరిష్కరించుకోవడానికి ఈ అంబుడ్జ్మన్ పద్ధతి సాయపడుతుందని ఆయన అన్నారు. వారిని ఇంటర్నల్ అంబుడ్జ్మన్గా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. కస్టమర్ల సమస్యలను స్వతంత్రంగా పరిశీలించి, పరిష్కారాలను కనుక్కోవడమే ఈ ఇంటర్నల్ అంబుడ్జ్మన్ బాధ్యతని చెప్పారు. అందరు కస్టమర్లు ఒకే రకమైన సర్వీస్ పొందాలని, అలా పొందలేదని భావించే కస్టమర్లు కంప్లయింట్ చేయొచ్చని అన్నారు. దేశంలో మారుతున్న వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా ఎన్బీఎఫ్సీ రెగ్యులేషన్స్నూ ఆర్బీఐ మారుస్తోందని చెప్పారు. దేశంలో మొత్తం 9,651 ఎన్బీఎఫ్సీలు ఉన్నాయి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు సహా ఎన్బీఎఫ్సీల చేతిలో మొత్తం 54 లక్షల కోట్ల ఎసెట్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ ఎసెట్స్లో ఇది 25 శాతం (అంటే నాలుగోవంతు)కి సమానం. గత అయిదేళ్లలో ఎన్బీఎఫ్సీ సెక్టార్ ఏటా17.91 శాతం చొప్పున ఎదిగింది.