యాప్స్ కు మస్తు గిరాకీ
విపరీతంగా పెరుగుతున్న యూజర్లు
ప్రభుత్వ యాప్ ‘స్వయం’కూ ఫుల్ డిమాండ్
బిజినెస్ డెస్క్, వెలుగు: ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలా? హార్వర్డ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ క్లాస్లు వినాలని ఉందా? గ్లోబల్ యూనివర్సిటీల లెక్చర్లు, ఫైథాన్ వంటి కష్టమైన స్కిల్స్, టైమ్ మేనేజ్మెంట్ వంటి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలా ? ఇలాంటి కోర్సులన్నీ ఆన్లైన్ యాప్స్, టీచింగ్ ప్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉన్నాయి. అందుకే ఆన్లైన్ లెర్నింగ్ యాప్స్ వాడకం ఎన్నడూ లేనంతగా పెరుగుతోంది . కరోనా దెబ్బ కూడా ఇందుకు ఒక కారణం. నేర్చుకునే వారికి ఈ పద్ధతి కొత్తగా అనిపించినా, రిమోట్ లెర్నింగ్(ఆన్లైన్ లెర్నింగ్) వేగంగా విస్తరిస్తుందని నిపుణులు అంటున్నారు. ఆన్లైన్ కోర్సులను అందించే యాప్లకు సబ్స్క్రయిబర్లు కూడా వేగంగా పెరుగుతున్నారు. ఆన్లైన్ లెర్నింగ్ యాప్ కోర్స్ఎరాకు ఇండియాలో భారీగా సబ్స్క్రయిబర్లు పెరిగారు. 2019 మొత్తంలో 14 లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఈ యాప్కు వస్తే, ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు 36 లక్షల మంది సబ్స్క్రయిబర్లు కొత్తగా చేరారు. ఇదే టైమ్లోనే మరో ఆన్లైన్ లెర్నింగ్ యాప్ ఎడెక్స్కు 32 లక్షల మంది యాడ్ అయ్యారు. ఏడాది ప్రాతిపదికన చూస్తే ఆన్లైన్లో నేర్చుకునేందుకు ఖర్చు చేస్తున్న సమయం 245 శాతం పెరిగిందని లింక్డ్ఇన్ రిపోర్ట్ చెబుతోంది. ఇవే కాదు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ‘స్వయం’కూ సబ్స్క్రయిబర్లు పెరిగారు. ఆన్లైన్ కోర్సులకు ప్రతి సెమిస్టర్లో 20 శాతం వరకు క్రెడిట్ను ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని అన్ని యూనివర్సిటీలను, కాలేజీలను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆదేశించింది.
కొత్త కోర్సులకు పెరుగుతున్న డిమాండ్..
గతంలో కంప్యూటర్ సైన్స్, డేటా ఎనాలసిస్ వంటి కోర్సులను తీసుకున్నవారు కూడా ఇతర కోర్సులలో జాయిన్ కావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ‘పబ్లిక్ హెల్త్ కోర్సులో జాయిన్ అయిన వారు ఏడాది ప్రాతిపదికన 4,386 శాతం పెరిగారు’ అని కోర్స్ఎరా ఇండియా ఎండీ రాఘవ్ గుప్తా చెప్పారు. గత కొన్ని నెలల్లో కరోనాకు సంబంధించిన కోర్సులను లాంఛ్ చేశామని, వీటికి మంచి డిమాండ్ వస్తోందని అన్నారు. మే నెలలో అందుబాటులోకి తెచ్చిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ కోర్సు ‘కోవిడ్ 19 కాంటాక్ట్ ట్రేసింగ్’ కు ఆరు లక్షల మంది వరకు ఎన్రోల్ అయ్యారని పేర్కొనారు. ఇండియా నుంచే ఈ కోర్సుకు 53,600 మందికి పైగా చేరారని చెప్పారు. ఇండియాలో పబ్లిక్ హెల్త్ తర్వాత ఈ కోర్సే ఎక్కువ పాపులర్ అని పేర్కొన్నారు. కరోనా పేషెంట్లను ట్రీట్ చేయడంలో మెకానికల్ వెంటిలేటర్లను ఏ విధంగా వాడాలో చెప్పే ఆన్లైన్ కోర్సులను హార్వర్డ్, ఎడ్ఎక్స్ ఫ్రీగా తీసుకొచ్చాయి. ఈ కోర్సును నేర్చుకునేందుకు మొదటి నెలలో 10 లక్షలకు పైగా చేరారని ఎడ్ఎక్స్ ఇండియా హెడ్, అమిత్ గోయల్ చెప్పారు. కోర్సును పూర్తి చేసేవారు కూడా ఎక్కువగానే ఉన్నారని పేర్కొన్నారు. కరోనాతో వర్క్ ఎన్విరాన్మెంట్లో మార్పులొచ్చాయని లింక్డ్ఇన్ టాలెంట్ డైరెక్టర్ రుచీ ఆనంద్ అన్నారు. కంపెనీలు తమ ఉద్యోగుల స్కిల్స్ను డెవలప్ చేయడంపై దృష్టి పెట్టాయని అన్నారు. ఫైథాన్ వంటి కష్టమైన కోర్సులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని, ప్రొఫెషనల్స్ తమ స్కిల్స్ను పెంచుకోవాలనుకుంటున్నారని చెప్పారు. రిమోట్గా వర్క్ చేయాలనుకుంటే టైమ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ వంటి సాఫ్ట్ స్కిల్స్ అవసరమని ఉద్యోగులు భావిస్తున్నారని చెప్పారు. ఆన్లైన్ లెర్నింగ్కు డిమాండ్ పెరగడానికి కారణం, ఈ పద్ధతిలో బెనిఫిట్స్ ఎక్కువగా ఉండడమే. యూజర్లు తమకు నచ్చిన ప్లేస్ నుంచే తమకు నచ్చిన కోర్సులను నేర్చుకోవచ్చు.