- రిటెయిలర్లు, కన్జూమర్ కంపెనీల ఆశలు
బిజినెస్ డెస్క్, వెలుగు: బట్టలు, జ్యుయెలరీతోపాటు ట్రావెల్ కంపెనీలు ఈ పండగల సీజన్తో తమ అమ్మకాలు పెరుగుతాయని ఆశలు పెంచుకుంటున్నాయి. మొత్తం ఏడాది సేల్స్లో ఒక్క డిసెంబర్ క్వార్టర్లోనే 30 నుంచి 40 శాతం జరుగుతాయి. బట్టలు, ఎలక్ట్రానిక్స్, గిఫ్టులు, ఇంట్లో ఫర్నిషింగ్స్వంటివన్నీ పండగల సీజన్లోనే కొనడం ప్రజలకు అలవాటు. కిందటేడాది పండగల జోష్ లేకపోవడంతో ఈ కంపెనీలకు అమ్మకాలూ లేవు. ఈసారి మాత్రం కన్జూమర్లు కొనుగోళ్లకు ఎగబడతారని అంచనా వేస్తున్నట్లు ఇప్సాస్ ఇండియా సీఈఓ అమిత్ అదార్కర్ చెప్పారు. గత అయిదు నెలలుగా ప్రైమరీ కన్జూమర్ సెంటిమెంట్ ఇండెక్స్ (పీసీఎస్ఐ) నిలకడగా పెరుగుతోంది. కిందటేడాదితో పోలిస్తే ఇది 9 పాయింట్లు పెరిగింది. చాలాకాలంగా ఇంటి వద్దే ఉండిపోవడంతో ఎక్కువ మంది ఈ పండగల సీజన్లో తప్పనిసరిగా బట్టలు కొనాలనుకుంటున్నారని లిబాస్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధాంత్ కేష్వాని పేర్కొన్నారు. కరోనా టైములో క్యాజువల్ క్లాత్స్తోనే ప్రజలు కాలం గడిపేశారన్నారు. ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ లేని ఫెస్టివల్ మూడ్ ప్రజలలో ఇప్పుడు కనిపిస్తోందని చెప్పారు. కొత్త రకాలతో వార్డ్రోబ్స్ను నింపుకోవాలని కన్జూమర్లు కోరుకుంటున్నట్లు లెవీస్ చెబుతోంది. చాలా ఏళ్ల తర్వాత ఈ దీపావళి మాకు మంచి సేల్స్ తేనుందని లెవీస్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మొహంతి వెల్లడించారు.
కరోనా ముందుకు లెవెల్కు సేల్స్..
దేశంలోని రిటెయిలర్లు కూడా ఇదే మాట చెబుతున్నారు. సెప్టెంబర్ నెలలో అమ్మకాలు కరోనా ముందు నాటి సేల్స్లో 96 శాతానికి చేరినట్లు పేర్కొంటున్నారు. ఈ డేటాను రిటెయిలర్స్ అసోసియేషన్ విడుదల చేసింది. రిటెయిల్ సెక్టార్కు ఈ పండగల సీజన్ టర్న్ అరౌండ్ అవుతుందని ఆర్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కుమార్ రాజగోపాలన్ అన్నారు. వ్యాక్సినేషన్ జోరందుకోవడంతో ఈసారి రిటెయిలర్లు ఎక్కువగా టెన్షన్ పడటం లేదని డెలాయిట్ టచ్ పార్ట్నర్ పోరస్ డాక్టర్ చెప్పారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లు ఫెస్టివల్ సేల్స్ మొదటి 4 రోజుల్లో 2.7 బిలియన్ డాలర్ల సేల్స్ సాధించినట్లు డేటా చెబుతోంది.
12 రోజుల్లో రూ. 29 వేల కోట్లు
క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోళ్లు
అక్టోబర్ నెల మొదటి 12 రోజులలో కార్డు కొనుగోళ్లు ఆన్లైన్లో రూ. 29 వేల కోట్లకు చేరాయి. ఈ డేటాను ఆర్బీఐ తొలిసారిగా విడుదల చేసింది. ఈ–కామర్స్ వెబ్సైట్స్లో కొనుగోళ్లపైనే ఈ మొత్తాన్ని వెచ్చించినట్లు వెల్లడించింది. ఇప్పటిదాకా ఈ–కామర్స్, పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్)ల డేటాను కలిపే ఆర్బీఐ ప్రకటించేది. అక్టోబర్ మొదటి 12 రోజులలో ప్రజలు క్రెడిట్ కార్డుల ద్వారా రూ. 19,817 కోట్లు, డెబిట్ కార్డుల ద్వారా రూ. 9,304 కోట్లు ఖర్చు చేసినట్లు ఆర్బీఐ వివరించింది. పీఓఎస్ల ద్వారా క్రెడిట్ కార్డుల కొనుగోళ్లు రూ. 10,840 కోట్ల దాకా ఉన్నాయని, ఇదే టైములో డెబిట్ కార్డుల ద్వారా రూ. 15,781 కోట్లను కన్జూమర్లు వెచ్చించారని ఈ డేటా తెలిపింది. సెప్టెంబర్ నెల మొత్తానికి చూస్తే ఈ–కామర్స్ సైట్లలో క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు రూ.62,936 కోట్లుండగా, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు రూ. 51,701 కోట్లుగా ఉన్నాయి.