హైదరాబాద్, వెలుగు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. వైరస్కు వ్యాక్సిన్ లేక మృతి చెందుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువున్న వాళ్లు మాత్రం త్వరగా రికవర్ అవుతున్నారు. దీంతో ఇప్పుడు జనమంతా ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇమ్యూనిటీ బూస్టర్ల వైపు పరుగు తీస్తున్నారు. అయితే ప్రపంచలో అన్నింటి కన్నా అతి పెద్ద ఇమ్యూనిటీ బూస్టర్ తల్లిపాలేనని డాక్టర్లు చెబుతున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు కచ్చి
తంగా తల్లి పాలు పట్టించాలని, భవిష్యత్ లోనూ ఇదే పెద్ద ఇమ్యూనిటీ బూస్టర్ అని అంటున్నారు.ఈ కరోనా టైమ్లో తల్లి పాలు మరింత అవసరమని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ తల్లి పాలవారోత్సవాలు జరుగుతున్నాయి.
తల్లి పాలలో కోట్ల ఇమ్యూనో గ్లోబ్లిన్స్
తల్లి పాలల్లో ఇమ్యూనో గ్లోబ్లిన్స్ (యాంటీబాడీస్)ఎక్కువగా ఉంటాయి. డబ్బా పాలల్లో మిల్లీగ్రామ్ కూడా ఉండవు. ఏటా మిలియన్ల శిశువుల ప్రాణాలను తల్లి పాలే కాపాడుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. బిడ్డపుట్టిన తొలిమూడు రోజుల్లో కచ్చితంగా ముర్రుపాలు పట్టించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అందులో కొన్ని కోట్ల ఇమ్యూనో గ్లోబ్లిన్స్ ఉంటాయంటున్నా రు. ఒక్క బొట్టు పాలలో లక్షల ఇమ్యూనో గ్లోబ్లిన్స్ ఉంటాయని చెబుతున్నారు. ఇవన్నీ బిడ్డలో ఉంటేనే వైరస్పై ఫైట్చేసే కెపాసిటీ పెరుగుతుందని వివరిస్తున్నారు.
ఈ టైమ్లోనే బాగా తాగించాలి
కరోనా విజృంభిస్తున్న ఈ టైమ్లోనూ బిడ్డకు తల్లి పాలు తాగించవచ్చని, ఇందులో ఎలాంటి సందేహం వద్దని డాక్టర్లు అంటున్నారు.ఇలాంటి టైమ్లోనే ఇంకా ఎక్కువగా ఫీడ్చేయాలంటున్నారు. తల్లికి కరోనా తేలినా బిడ్డకు కొన్నిజాగ్రత్తలతో పాలు పట్టొచ్చని చెబుతున్నారు. మాస్క్ వేసుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడంతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. డబ్ల్యూహెచ్వో, యునిసెఫ్ కూడా ఇదే చెప్పాయని స్పష్టం చేస్తున్నారు. తల్లినుంచి పాలు తీసి వేరుగా బిడ్డకు తాగిస్తే ఇంకా మంచిదంటున్నారు.
తల్లి పాల ప్రాముఖ్యం చెప్పే టైమిది
కొందరు వివిధ కారణాలతో బిడ్డపుట్టిన కొన్ని రోజుల్లోనే పాలు బంద్చేస్తారు. కొందరు జాబ్లకు వెళ్లాలని, ఆధునిక పోకడలకు అలవాటు పడి,అవగాహన లేక తొందరగా పాలు మాన్పిస్తుంటారు. తల్లి పాల ప్రాముఖ్యం గురించి చెప్పేందుకు ప్రస్తుత కరోనా టైమే సరైందని నిపుణులు చెబుతున్నారు. ఈ కరోనా టైమ్లో ఇమ్యూనిటీ లేని వాళ్లు ఎన్ని తంటాలు పడుతున్నారో అందరికీ తెలిసిందేనని, కాబట్టి తల్లిపాల ప్రాముఖ్యంపై ప్రభుత్వం ప్రజలకు చైతన్యం, అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. తద్వారా భవిష్యత్లో ఎలాంటి రోగం వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుందన్నా రు.