- లాక్డౌన్ అయిపోయినప్పటి నుంచి పెరుగుతున్న నియామకాలు
- విదేశాల నుంచి కొత్త ప్రాజెక్టులు వస్తుండటంతో ఖాళీల భర్తీ
- కరోనా వల్ల ఏడాదిన్నరగా ఆగిపోయిన రిక్రూట్మెంట్స్
- విదేశాల నుంచి కొత్త ప్రాజెక్టులు వస్తుండటంతో ఖాళీల భర్తీ
- 30 శాతం కన్నా ఎక్కువ ఆఫర్ చేస్తున్న కొన్ని కంపెనీలు
- కరోనా వల్ల ఏడాదిన్నరగా ఆగిపోయిన రిక్రూట్మెంట్స్
- కరోనా హెల్త్ ప్రాబ్లమ్స్, రాజీనామాలతో ఉద్యోగుల కొరత
హైదరాబాద్, వెలుగు: సాఫ్ట్ వేర్ కంపెనీల్లో రిక్రూట్మెంట్స్ జోరందుకున్నాయి. లాక్డౌన్ అయిపోయినప్పటి నుంచి ఉద్యోగులను తీసుకోవడం కంపెనీలు స్టార్ట్ చేశాయి. విదేశాల నుంచి కొత్త ప్రాజెక్టులు వస్తుండటం.. సీనియర్లు, ఎక్స్పర్ట్స్ కొరత ఉండటంతో ఖాళీలను భర్తీ చేస్తున్నాయి. త్వరలో థర్డ్ వేవ్ స్టార్టవుతుందన్న హెచ్చరికలతో అంతకుముందే అవసరమైన వాళ్లను రిక్రూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ టైమ్ వల్ల గతేడాది జనవరి నుంచి అన్ని కంపెనీల్లో రిక్రూట్మెంట్లు ఆగిపోయాయి. చాలామంది రిజైన్ చేయడం, కరోనాతో హెల్త్ సమస్యలు రావడంతో కంపెనీల్లో ఖాళీలు ఏర్పడ్డాయి.
ఆఫర్లే ఆఫర్లు
ప్రస్తుతం ఖాళీగా ఉన్న టేకీలకు, వేరే కంపెనీల్లో వారికీ కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. చాలా కంపెనీలు 30 శాతం ఎక్కువ ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నాయి. అనేక కంపెనీలు రిక్రూట్ చేస్తుండటంతో ఒక్కో టెకీకి కనీసం నాలుగైదు ఆఫర్లు వస్తున్నాయని రిక్రూటర్లు చెబుతున్నారు. తమకు వస్తున్న ఆఫర్లను చూపిస్తూ ఎక్కువ ప్యాకేజ్ను టెకీలు అడుగుతున్నారని అంటున్నారు. కంపెనీ, జాబ్ రోల్, ప్యాకేజ్ను బట్టి టెకీలు కంపెనీల్లో చేరుతున్నారని చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 6 నెలల్లో దేశవ్యాప్తంగా సుమారు లక్ష మంది టెకీలను కంపెనీలు రిక్రూట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో చిన్నాపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని కలిపి సుమారు 1,300 ఉండగా వీటిలో 6.5 లక్షల మంది పనిచేస్తున్నారు. కొత్త నియామకాల్లో ప్రెషర్స్ కంటే అనుభవం ఉన్నవారికే కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా పెరగొచ్చు
విదేశాల నుంచి ప్రాజెక్టులు బాగా వస్తున్నాయి. నిపుణుల కొరత ఉంది. రిజైన్ చేసిన ఉద్యోగి 4, 5 కంపెనీల ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు. ఒక్కో టెకీకి నాలుగైదు ఆఫర్లు వస్తున్నాయి. పాత కంపెనీ ప్యాకేజ్ కంటే 50 నుంచి 80 శాతం ఎక్కువ టెకీలు కోరుతున్నారు. థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఐటీ ఇండస్ట్రీ మీద, రిక్రూట్ మెంట్పై ఉండకపోవచ్చు. ఉద్యోగులకు ల్యాప్ ట్యాప్లు, నెట్ చార్జ్, టేబుల్, చైర్స్ అన్నీ వారి ఇండ్లకే కంపెనీలు పంపిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ పెరగొచ్చు. - రామకృష్ణ, హెచ్ఆర్ రిక్రూటర్
ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది
కరోనా టైమ్లో కంపెనీలకు ఇన్ఫ్రా కాస్ట్ బాగా తగ్గింది. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటంతో కంపెనీలకు డబ్బు మిగిలింది. ప్రాజెక్టులు పెరుగుతుండటంతో రెండు నెలలుగా రిక్రూట్మెంట్లు పెరిగాయి. ప్రస్తుతం ఆటోమేషన్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ సెక్టార్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలకు డిమాండ్ పెరిగింది. ఈ రంగాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్లకు కంపెనీలు భారీ ప్యాకేజ్ ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు 30 శాతం ఎక్కువ ప్యాకేజ్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఒక్కో ఉద్యోగికి 3, 4 ఆఫర్లు చేతిలో ఉంటున్నాయి. ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చిన ఆఫర్ చూపి మరో కంపెనీకి మారుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోం ద్వారా కంపెనీలో చేసిన దానికన్నా ఎక్కువ గంటలు టెకీలు పనిచేస్తున్నారు. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది.
- సందీప్ కుమార్ మక్తాల, గ్లోబల్ ప్రెసిడెంట్, తెలంగాణ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్
కంపెనీ మారుదామనుకుంటున్న
నాలుగేళ్లుగా ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నా. నాతో పాటు చేరిన వాళ్లు కంపెనీలు మారారు. లాక్ డౌన్ తర్వాత రిక్రూట్మెంట్లు జరగుతున్నాయి. ఆఫర్లు వస్తున్నాయి. త్వరలో కంపెనీ మారుదామని అను కుంటున్నా. ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవడంతో పాటు డిమాండ్ ఉన్న కో ర్సులను ఆన్లైన్లో నేర్చుకుంటున్నా.
- నరేశ్రెడ్డి, సాప్ట్ వేర్ ఎంప్లాయ్