మంచిర్యాల బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చకుంటే ఓడిస్తం

మంచిర్యాల బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చకుంటే ఓడిస్తం
  • బీఆర్ఎస్ హైకమాండ్​కు గడ్డం అరవింద్​ రెడ్డి వార్నింగ్
  • తనకు లేదా బీసీకి ఇచ్చినా గెలిపించుకుంటామని వెల్లడి

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల నియోజకవర్గ అభ్యర్థిని మార్చాలని.. లేదంటే బీఆర్ఎస్ కు ఓటమి తప్పదని ఆ పార్టీ హైకమాండ్​కు మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్​రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వారం రోజుల్లో అభ్యర్థిని మార్చని పక్షంలో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ టికెట్​ను సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావుకు కేటాయించడంపై ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. ఆదివారం మంచిర్యాలలోని తన నివాసంలో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్​నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించడమే కాకుండా బీఆర్ఎస్ బలోపేతానికి శ్రమించిన అరవింద్​రెడ్డికి కేసీఆర్ అన్యాయం చేశారని ఆయన సపోర్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అరవింద్​రెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. 

లేదంటే ఆయనను ఇండిపెండెంట్​గా బరిలో నిలిపి గెలిపించుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా అరవింద్​రెడ్డి మాట్లాడుతూ.. దివాకర్ రావు హయాంలో నియోజకవర్గం పదేండ్లు వెనక్కు పోయిందన్నారు. మిషన్ భగీరథ బట్టలు ఉతకడానికి కూడా పనికి రావడం లేదన్నారు. మంచిర్యాలలో శ్మశానవాటిక లేదని, డంపింగ్ యార్డు నిర్మించలేదని అన్నారు. 

మరోసారి దివాకర్​రావును గెలిపిస్తే నియోజకవర్గం మరో ఐదేండ్లు వెనుకబడుతుందని పేర్కొన్నారు. మూడు పార్టీలకు వెలమ దొరలు తప్ప నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. బీసీకి టికెట్ ఇస్తే బంపర్ మెజారిటీతో గెలిస్తామన్నారు. ఈ విషయమై త్వరలోనే ఉద్యమకారులతో కలిసి మంత్రులు హరీశ్​రావు, కేటీఆర్​లను కలుస్తామన్నారు. వారం రోజుల్లో అభ్యర్థిని మార్చకపోతే తన భవిష్యత్​ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. సమ్మేళనంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్​గౌడ్, ముత్తినేని రవి మాట్లాడారు.