ఎంపీగా గెలిపిస్తే ముంపు బాధితుల సమస్యలు తీరుస్తా : గడ్డం వంశీకృష్ణ

  ఎంపీగా గెలిపిస్తే ముంపు బాధితుల సమస్యలు తీరుస్తా :   గడ్డం వంశీకృష్ణ

ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నారు పెద్దపల్లి లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం, తాళ్ళకొత్తపేట గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలని కలిశారు వంశీ. కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఎల్లంపల్లి ముంపు గ్రామాల సమస్యలపై ఆరా తీశారు. పదేళ్లుగా పడుతున్న బాధలను వివరించారు ముంపు బాధితులు. ఎంపీగా గెలిపిస్తే ముంపు బాధితుల సమస్యలు తీరుస్తామని చెప్పారు. 

గత బీఆర్ఎస్  సర్కార్ ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు వంశీకృష్ణ. ముంపు గ్రామాల్లో యువతీ యువకులకు రావాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్, భూ పరిహారం సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. నిరుపేదల కోసం UPA ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశ పెట్టిందని వివరించారు. 

కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉపాధి కూలీ పనిదినాలను పెంచడంతో పాటు కూలీ రేట్లు 4 వందలకు పెంచేలా కృషి చేస్తామన్నారు. ధర్మపురి MLA లక్ష్మణ్ కుమార్ చొరవతో ధర్మపురి నియోజకవర్గంలో ముంపు గ్రామాలకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు.