గడ్డం వంశీకృష్ణను భారీ మోజార్టీతో గెలిపించుకుంటం : పెద్దపల్లి కాంగ్రెస్ నేతలు

గడ్డం వంశీకృష్ణను భారీ మోజార్టీతో గెలిపించుకుంటం :  పెద్దపల్లి కాంగ్రెస్ నేతలు

పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ టికెట్ గడ్డం వంశీ కృష్ణకు కేటాయించడం పట్ల జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు.  వంశీ కృష్ణకి టికెట్ కేటాయించడంలో సహకరించిన పార్టీ ఎమ్మెల్యే,  ఎంపీలకు కాంగ్రెస్ పెద్దలకు  ధన్యవాదాలు తెలిపారు.  పార్లమెంట్ ఎంపీ ఎన్నికల్లో వంశీకృష్ణను భారీ మోజార్టీతో గెలిపించుకుంటామన్నారు.  

కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కాకా వెంకటస్వామి మనుమడు గడ్డం వంశీకృష్ణ. చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, సరోజ దంపతులకు ఆయన పెద్ద కుమారుడు. తాత, తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లో ప్రవేశించిన వంశీకృష్ణ.. పెద్దపల్లి లోక్​సభ స్థానం నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. నాలుగు నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ నియోజకవర్గం నుంచి వివేక్​వెంకటస్వామి విజయం సాధించడంలో గడ్డం వంశీకృష్ణ  క్రియాశీలక పాత్ర పోషించారు. 

ఆ సమయంలో కేడర్​ను సమీకరించడంలో, ప్రచార వ్యూహాలు రచించి, అమలుచేయడంలో సక్సెస్​ అయ్యి కాంగ్రెస్​ హైకమాండ్​ దృష్టిలో పడ్డారు. విశాక ఇండస్ట్రీస్ జేఎండీగా ఉన్న గడ్డం వంశీకృష్ణ.. యువ ఆవిష్కర్తగా, బిల్డింగ్​ మెటీరియల్​ప్రొవైడర్​గా  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2011లో విశాక ఇండస్ట్రీలో మేనేజ్​మెంట్​ ట్రైనీగా చేరి, 2012 నాటికే ప్రధాన వ్యాపార వ్యూహకర్తగా ఎదిగారు.  2014 నుంచి 2017 వరకు డైరెక్టర్​గా,  ఆ తర్వాత మేనేజింగ్ డైరెక్టర్​గా బాధ్యతలు చేపట్టారు. 

ఎన్నో ఇన్నోవేషన్స్ తో ప్రజల ముందుకు వచ్చారు. వీ నెక్ట్స్, ఆటం, సోలార్ రూప్ లాంటి ఆవిష్కరణలకు ఇండియాతో పాటు విదేశాల్లో పేటెంట్ పొందారు. పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూనే వ్యాపార రంగంలో రాణిస్తున్నారు.  సామాజిక సేవరంగంలోనూ గడ్డం వంశీకృష్ణ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో విశాక ఇండస్ట్రీస్​తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో ఆదరణ పొందారు.