ఎంపీగా గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తా.. : గడ్డం వంశీకృష్ణ

ఎంపీగా గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తా.. : గడ్డం వంశీకృష్ణ

గోదావరిఖని, వెలుగు: తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని పెద్దపల్లి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆదివారం రామగుండం నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే మక్కన్​సింగ్​రాజ్​ఠాకూర్​తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఉదయం గోదావరిఖని పట్టణంలో లయన్స్​ క్లబ్​ ప్రతినిధులు, ఆర్ఎంపీ, పీఎంపీలు, మెడికల్​ షాప్​ల నిర్వాహకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

మధ్యాహ్నం పాలకుర్తి మండలం జయ్యారం, అంతర్గాం మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలను కలిసి ఓటడిగారు. గోదావరిఖనిలో లైన్​ లారీ అసోసియేషన్​, మున్సిపల్​ కార్మికులు, బ్యాంకర్స్​తో సమావేశమయ్యారు. సాయంత్రం గోదావరిఖని పట్టణంలో బైక్​ ర్యాలీ నిర్వహించగా, రాత్రి సమయంలో ఓల్డ్​ అశోక్​ థియేటర్​ వీకే రెడ్డి సెంటర్, రమేశ్​ నగర్​ సెంటర్, ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లలో నిర్వహించిన కార్నర్​ మీటింగుల్లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నానని, తనను ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ కోసం కాకా వెంకటస్వామి పోరాడారన్నారు. ఆయన వారసత్వంగా, సేవే లక్ష్యంగా ఎంపీగా పోటీ చేసే తనను ప్రజలు ఆదరించాలని కోరారు. కేసీఆర్​ మాయమాటలను ప్రజలను నమ్మవద్దని, బీఆర్ఎస్‌‌కు పార్లమెంట్​ ఎన్నికల్లోనూ బుద్ధి చెప్పాలన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్నకొడుకు లెక్క సేవా చేస్తానని వంశీకృష్ణ స్పష్టం చేశారు. 

బీజేపీని గెలిపిస్తే రిజర్వేషన్లు తొలగిస్తారు

కేంద్రంలో బీజేపీని మళ్లీ గెలిపిస్తే అంబేద్కర్‌‌‌‌ రాసిన రాజ్యాంగాన్ని మార్చుతారని, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న రిజర్వేషన్లను తొలగిస్తారని ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​ ఆరోపించారు. కేసీఆర్​ ఇటీవల గోదావరిఖనికి వచ్చి తుపాకీ రాముడి మాటలు మాట్లాడి వెళ్లారని, ఆయన ప్రసంగంలో పస లేదన్నారు. తన కూతురు కవితను జైలు నుంచి విడిపించుకోవడానికి, బీజేపీతో కుమ్మక్కయ్యారన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్​, వంశీకృష్ణ సమక్షంలో మాజీ కార్పొరేటర్ ఉమా సాంబా మూర్తి ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు రాజేశం, వెంకటేశ్‌‌, బత్తుల స్వామి, శేఖర్, రాజ్యం శోభన్ బాబు, వెంకటస్వామి, మల్లేశ్‌‌, , రవితేజ, నాగేశ్వర్ రావు, కృష్ణ, కొత్త రాజేందర్, తిరుపతి, రాజయ్య, రమేశ్​, దివాకర్​తో పాటు 100 మంది కాంగ్రెస్ లో చేరారు. 

డోలు వాయించిన రాజ్​ఠాకూర్​, వంశీకృష్ణ

ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్​లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌‌ఠాకూర్​తో కలిసి అంతర్గాం మండలం సోమన్ పల్లి  గ్రామంలోని శ్రీ బీరప్ప స్వామి కామరతిదేవి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి డప్పు, ఒగ్గు డోలు వాయించి ప్రజల్లో ఉత్సాహం నింపారు.