ఇటీవల గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగానే ఇకపై నంది అవార్డుల స్థానంలో ‘గద్దర్’ అవార్డులు ఇవ్వనున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం వెల్లడించింది. సినీ, టీవీ కళాకారులకు వీటిని అందజేస్తామని తెలిపింది.
‘‘ప్రజా యుద్ధ నౌక గద్దరన్నకు ఇది మేమిచ్చే నివాళి. గద్దరన్నను గౌరవించుకోవడం అంటే తెలంగాణ సంస్కృతిని, ప్రగతిశీల భావజాలంతో సమాజాన్ని చైతన్య పరిచే ప్రజా కవులను, ప్రజాగాయకులను గౌరవించుకోవడమే. అందుకే ఇక నుంచి గద్దర్ అవార్డులు తెలంగాణ కళాకారుల కీర్తిపతాకను ప్రపంచానికి చాటి చెప్తాయి” అని బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొంది.
మన రాష్ట్ర వాహన రిజిస్ట్రేషన్ కోడ్ టీఎస్ నుంచి టీజీగా మారుస్తున్నామని తెలిపింది. రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మారుస్తున్నామని, భారత రాజ్యాంగ స్పూర్తితో.. ప్రజాస్వామ్యం, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వాటిని తీర్చిదిద్దుతామని బడ్జెట్లో ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ తల్లుల ప్రతిరూపం ఉట్టిపడేటట్టు ‘తెలంగాణ తల్లి’ విగ్రహాన్ని రూపొందించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.
