నర్వ, వెలుగు: లబ్ధిదారులను ప్రోత్సహించి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం ఎంపీడీవో ఆఫీస్లో ఇందిరమ్మ ఇండ్లు, నర్వ యాస్పరేషన్ బ్లాక్ పై వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నర్వ మండలం జిల్లాలో చివరి స్థానంలో ఉందని అసహనం వ్యక్తం చేశారు. మండలానికి 308 ఇండ్లు మంజూరు కాగా, 170 ఇండ్లకు ముగ్గు పోశారని, 98 బేస్ మెంట్ లెవల్లో, 10 స్లాబ్ లెవల్లో, 17 లెంటల్ లెవల్లో ఉన్నాయని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, మండల ప్రత్యేక అధికారులు లబ్ధిదారులతో మాట్లాడి ఇండ్ల నిర్మాణం స్పీడప్ చేయాలని సూచించారు.
యాస్పిరేషన్ బ్లాక్ కింద ఎంపికైన మండలంలో నీతి అయోగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. ఇన్నోవేటివ్ ప్రాజెక్టు కింద నర్వ మండలం ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అడిషనల్ కలెక్టర్ సంచిత్ గాంగ్వర్, డీఆర్డీవో మొగులప్ప, డిప్యూటీ డీఎంహెచ్ వో శైలజ, ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం
కోస్గి, వెలుగు: గుండుమాల్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం ఆరు ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్దిదారులు ఇందిరమ్మ ఇండ్లను నాణ్యతగా, వేగంగా నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం గుండుమాల్ పీహెచ్సీని తనిఖీ చేసి ప్రసవాల సంఖ్యను పెంచాలని సిబ్బందికి సూచించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.
