అశేష జనసందోహం తరలిరాగా కన్నీటి సంద్రం నడుమ ప్రజా గాయకుడు గద్దర్ (74) అంత్యక్రియలు ముగిశాయి. సోమవారం రాత్రి 8.10 నిమిషాలకు అల్వాల్లోని మహాబోధి విద్యాలయ ఆవరణలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో.. బౌద్ధ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. అంతకుముందు కడసారిగా గద్దర్ను చూసేందుకు ఎల్బీ స్టేడియానికి రాజకీయ, సినీ, వివిధ రంగాల ప్రముఖులు, కళాకారులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి ఉద్యమ వీరుడికి నివాళులు అర్పించారు. అనంతరం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియం నుంచి గన్పార్క్, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం, ట్యాంక్ బండ్ మీదుగా అల్వాల్ వరకు అంతిమయాత్ర కొనసాగింది. ఆయన ఇంటి వద్ద పార్థివదేహాన్ని ఉంచిన తర్వాత సమీపంలోని బోధి విద్యాలయంలో అంత్యక్రియలు చేపట్టారు. సీఎం కేసీఆర్.. గద్దర్ పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సుమారు 6 గంటల పాటు కొనసాగిన అంతిమయాత్రలో దారిపొడవునా కళాకారులు పాడుతూ అంజలి ఘటించారు. - అల్వాల్ వెలుగు
ఎవరెస్ట్ కన్నా ఎత్తులో నిలబడ్డారు: మందకృష్ణ
మేం నిరంతరం కలుసుకోలేకపోయినా.. ఒకరంటే ఒకరం చాలా గౌరవంగా ఉండేవాళ్లం. పీడిత వర్గాల సమాజానికి పెద్ద దిక్కుగా మా అందరి మనసులో నిలబడిన వ్యక్తి గద్దర్. ప్రజా కళాకారుడిగా ఎవరెస్ట్ శిఖరం కన్నా ఎత్తులో ఆయన నిలిచారు.
అడవిలో అన్న సినిమాకి డైలాగ్ లు, పాటలు రాశారు: మోహన్ బాబు
నాకు గద్దర్ తో 24 ఏళ్ల అనుబంధం. అన్న అంటూ ఎంతో ప్రేమగా పిలిచేవారు. వాళ్ల పిల్లలు మా స్కూల్ లో చదువుకున్నారు. అడవిలో అన్న సినిమాకి డైలాగ్ లు, పాటలు రాశారు. ఏదైనా సినిమాకి సలహాలు కావాలంటే ఇచ్చేవారు. పేదవారికి కడుపు నిండా భోజనం దక్కినప్పుడే స్వరాజ్యం వచ్చినట్లని పోరాటం చేసిన యోధుడు. ఆయన పాటలు చిరకాలం ఉంటాయి.
మాది 30 ఏళ్ల పరిచయం: నటుడు అలీ
గద్దరన్నతో నాకు 30 ఏళ్ల పరిచయం. ఎప్పుడు కలిసినా నవ్వుతూ మాట్లాడేవారు. పిట్టల దొర సినిమా రిలీజ్ రోజు నా ఇంటికి వచ్చి సినిమా హిట్ అవుతుందన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి ఇక లేడని తెలిసి చాలా బాధేసింది. ప్రజల మనసులో ఆయన బతికే ఉంటాడు.