గద్వాల, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగాంగా మూడవ విడత పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో ఎన్నికల అబ్జర్వర్ గంగాధర్ తో కలిసి మూడవ విడత పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఇటిక్యాల, ఎర్రవల్లి, అలంపూర్, మనవపాడు, ఉండవెల్లి మండలాల్లో నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికల కోసం 700 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 700 మంది పీవోలు, 859 ఓపీవోలతో కలిపి 1,559 మందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించామని చెప్పారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని తెలిపారు. డీపీవో శ్రీకాంత్, ఈడీఎం శివ పాల్గొన్నారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత..
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పట్టిష్టంగా ఉండాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. కలెక్టరేట్ ఆవరణలోని గోదామ్లో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ఆఫీసర్లు, పొలిటికల్ లీడర్లతో కలిసి తనిఖీ చేశారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ నరసింహారావు, తహసీల్దార్ మల్లికార్జున్, సూపరింటెండెంట్ కరుణాకర్ ఉన్నారు.
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ పక్కాగా నిర్వహించాలి
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ధరూర్, కేటిదొడ్డి ఎంపీడీవో ఆఫీస్ లలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎంపీడీవోలు కృష్ణమోహన్, రామారావు, తహసీల్దార్లు నరేందర్, హరికృష్ణ ఉన్నారు

