
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘గం గం గణేశా’ సినిమాతో నిర్మాతగా పరిచయమవుతున్నారు వంశీ కారుమంచి. హైలైఫ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో తన స్నేహితుడు కేదార్ సెలగంశెట్టితో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 31న సినిమా విడుదలవుతున్న సందర్భంగా వంశీ కారుమంచి మాట్లాడుతూ ‘మాది గుంటూరు. యూఎస్ వెళ్లి జాబ్స్, బిజినెస్ చేశాం. చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. బాలకృష్ణ అభిమానిని. అమెరికాలో కొన్ని తెలుగు సినిమాలను రిలీజ్ చేశాం. సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనే ప్లాన్ ఉండేది.
ఆనంద్, విజయ్ నాకు మంచి మిత్రులు. దర్శకుడు ఉదయ్ శెట్టి చెప్పిన కథ ఆనంద్కు బాగుంటుంది అనిపించింది. తను కూడా కథ విని ఓకే చెప్పాడు. ఆనంద్ ఈ సినిమాలో ఫంకీ క్యారెక్టర్లో కనిపిస్తాడు. కొంత ఆకతాయిగా, జులాయిగా ఉండే పాత్ర ఇది. మన స్నేహితుల్లో ఎవరో ఒకరు మనల్ని ప్రాబ్లమ్స్లో ఇరికిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో జనరేట్ అయ్యే కామెడీ ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ నవ్విస్తాడు.
ఇద్దరు హీరోయిన్స్ నయన్ సారిక, ప్రగతి శ్రీవాస్తవ మంచి పర్ఫార్మెన్స్ చేశారు. గణేష్ విగ్రహం, డబ్బుతో ముడిపడిన యాక్షన్ కామెడీ సినిమా. ఈ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఏపీ, కర్ణాటకలో ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. 400కు పైగా థియేటర్స్ దొరికాయి. అమెజాన్ ప్రైమ్తో ఓటీటీ డీల్ చేసుకున్నాం’ అని చెప్పారు.