
- మెడికల్ కాలేజీలకు కేంద్రం కొర్రీలు పెడుతున్నదని మంత్రి హరీశ్ ఫైర్
- గాంధీ, నిమ్స్ దవాఖాన్లను విజిట్ చేసిన మంత్రి
- ఒకట్రెండు రోజుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడి
- మెడికల్ కాలేజీల పర్మిషన్పై మంత్రి హరీశ్ ఫైర్
హైదరాబాద్/పద్మారావునగర్/ఖైరతాబాద్, వెలుగు : మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వకుండా, కేంద్ర ప్రభుత్వం కావాలనే కొర్రీలు పెడుతోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఎక్విప్మెంట్, స్టాఫ్, బిల్డింగ్ తదితర కారణాలు చెబుతూ పర్మిషన్ ఇవ్వడం లేదని, భువనగిరి ఎయిమ్స్లో ఏముందో చెప్పాలన్నారు. అక్కడ ఇప్పటి వరకూ ఒక్క పేషెంట్కూ చికిత్స అందించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఓ రూల్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మరో రూలా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులు ఎయిమ్స్లో ఏముందో చూడాలని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ దవాఖాన్లను పరిశీలించాని ఆయన సూచించారు. మంచిర్యాల్ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ పర్మిషన్ నిరాకరించిన నేపథ్యంలో హరీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని నిమ్స్, గాంధీ దవాఖాన్లను ఆయన సందర్శించారు. ఉదయం నిమ్స్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. మధ్యాహ్నం గాంధీలో పీడియాట్రిక్ ఐసీయూ, సర్జరీ ఐసీయూ, గైనిక్ ఎంఐసీయూ, సెమినార్ హాల్, గాంధీ వెబ్పోర్టల్ను కూడా మినిస్టర్ ప్రా రంభించారు. ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి అన్నారు. తమకు కేంద్రం నుంచి సహకారం లేదని, రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేంద్రం ఇవ్వలేదన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్కు మాత్రం 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిందని చెప్పారు. అయినా, ఇప్పటిదాకా ఆ హాస్పిటల్లో ఇన్పేషెంట్ సేవలను ప్రారంభించలేదని విమర్శించారు. అక్కడ కనీసం ఆపరేషన్ థియేటర్లేదని, ప్రొఫెసర్లు లేకుండానే ఎయిమ్స్ ను నిర్వహించడం సిగ్గుచేటన్నారు.
గాంధీలో మూడు నెలల్లో ఫర్టిలిటీ సెంటర్
గాంధీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఫర్టిలిటీ సెంటర్ ను మూడు నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని మంత్రి ప్రకటించారు. ఎంసీహెచ్ బిల్డింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. గాంధీలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఎలక్ట్రిసిటీ పనుల కోసం రూ 13.55 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని, అలాగే శానిటేషన్, డ్రైనేజీ పనులకు రూ .14 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. రూ.1.20 కోట్లతో నూతన డైట్ క్యాంటీన్ నిర్మాణ పనులనూ ప్రారంభించామని చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో 1,140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు.