
ముంబై: మహారాష్ట్ర ముంబైలోని ఓ గణేశ్ మండపానికి నిర్వహకులు అక్షరాల రూ.474.46 కోట్ల ఇన్సూరెన్స్ చేయించారు. సిటీలోని కింగ్ సర్కిల్లో ఉన్న జీఎస్బీ సేవా మండల్ ఏటా ఘనంగా గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తోంది. భారీ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, కోట్లు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలతో స్వామి వారిని అలంకరిస్తారు.
దీంతో ఏటా రూ.కోట్ల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయిస్తుంటుంది. గతేడాది రూ.400 కోట్లకు ఈ సేవా మండల్ ఇన్సూరెన్స్ చేయించింది. అయితే, వినాయకుడిని అలంకరించే బంగారం, వెండి ఆభరణాల విలువ పెరగడంతో ఇన్సూరెన్స్ విలువ కూడా పెంచామని నిర్వహకులు వెల్లడించారు.
అంతేకాకుండా, ఈ ఏడాది పాలసీ కింద వలంటీర్లు, పూజారులను కూడా చేర్చామని చెప్పారు. ఈ మేరకు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ నుంచి నిర్వహకులు పాలసీ తీసుకున్నారు.