న్యూఢిల్లీ: గతేడాది టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ దిగిపోతాడని బీసీసీఐ ఊహించలేదని బోర్డు మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. అందుకు బోర్డు ప్రిపేర్ అవ్వలేదని వెల్లడించాడు. అది అతని వ్యక్తిగత నిర్ణయమన్నాడు. టెస్టు కెప్టెన్సీని ఎందుకు వదులుకున్నాడో విరాట్ మాత్రమే చెప్పగలడని అన్నాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇండియా 209 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో చిత్తవడంతో టెస్టు పగ్గాలు తిరిగి కోహ్లీకి ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి బీసీసీఐ సిద్ధంగా లేదు. దక్షిణాఫ్రికా టూర్ తర్వాత అతని ప్రకటనను మేం ఊహించలేదు. కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకున్నాడో విరాట్ కోహ్లీ మాత్రమే వెల్లడించగలడు. కోహ్లీ స్వయంగా కెప్టెన్సీ వదులుకున్నందున ఇప్పుడు దీని గురించి చర్చ అనవసరం. సెలక్టర్లు కొత్త కెప్టెన్ని నియమించాల్సి వచ్చింది.ఆ సమయంలో రోహిత్ బెస్ట్ ఆప్షన్గా కనిపించాడు’ అని దాదా పేర్కొన్నాడు.