న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్లైన్స్ ప్రమోటర్లలో ఒకరైన గంగ్వాల్ ఫ్యామిలీ మరోసారి రూ. 3,730 కోట్ల విలువైన షేర్లను బుధవారం అమ్మనుంది. ఈ అమ్మకాన్ని బ్లాక్డీల్ ద్వారా జరపనున్నారు. 1.56 కోట్ల షేర్లను ఒక్కొక్కటి రూ. 2,400 చొప్పున విక్రయించడానికి గంగ్వాల్ ఫ్యామిలీ నిర్ణయించుకుంది. సోమవారం క్లోజింగ్ రేటు కంటే 5.8 శాతం డిస్కౌంట్కు గంగ్వాల్ ఫ్యామిలీ తమ వాటాలను అమ్మనుంది. మోర్గాన్స్టాన్లీ, జేపీ మోర్గాన్, గోల్డ్మన్ శాచ్స్ఈ బ్లాక్డీల్కు బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్లో గంగ్వాల్ ఫ్యామిలీకి 29.72 శాతం వాటా ఉంది. జూన్2023 చివరినాటికి కంపెనీలో ప్రమోటర్ల వాటా 67.77 శాతం. బీఎస్ఈ డేటా ఈ విషయం వెల్లడిస్తోంది.
ఇప్పుడు మార్కెట్ ధర ప్రకారం చూస్తే గంగ్వాల్ ఫ్యామిలీ చేతిలోని వాటాల విలువ రూ. 29,218 కోట్లవుతుంది. ఇండిగో ఎయిర్లైన్స్ను నడిపే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ కంపెనీ మొత్తం మార్కెట్ విలువ రూ. 98,313 కోట్లు. జూన్ 2022 నాటికి గంగ్వాల్ ఫ్యామిలీ వాటా 36.66 శాతం. అప్పటి నుంచి వరసగా ఆ వాటాను తగ్గించుకుంటూనే ఉన్నారు. కిందటేడాది ఫిబ్రవరిలో కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుంచి రాకేష్ గంగ్వాల్ వైదొలిగారు. రాబోయే అయిదేళ్లలో తన వాటాలను అమ్మాలనుకుంటున్నట్లు అప్పట్లోనే వెల్లడించారు. 2023–24 మొదటి క్వార్టర్లో ఇండిగో ఎయిర్లైన్స్కు రూ. 3,090 కోట్ల నికర లాభం వచ్చింది.
ఇదే కాలానికి కంపెనీ రెవెన్యూ రూ. 17,160 కోట్లు. ఇంతకు మునుపెన్నడూ ఇండిగో ఎయిర్లైన్స్కు ఇంత క్వార్టర్లీ లాభం, రెవెన్యూ రాలేదు. జూన్ నెలలో 2.62 కోట్ల మంది ప్రయాణికులను ఇండిగో ఎయిర్లైన్స్ హ్యాండిల్ చేసింది. ఈ ఎయిర్లైన్స్ చేతిలో 316 విమానాలున్నాయి. కిందటి క్వార్టర్లో కొత్తగా 12 విమానాలను కంపెనీ యాడ్ చేసుకుంది.