- ముగ్గురిని అరెస్ట్ చేసిన నార్త్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
- 130 కిలోల గాంజా స్వాధీనం
కంటోన్మెంట్, వెలుగు: గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్, బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.32.50లక్షల విలువైన 130 కిలో గంజాయి, 2 కార్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం బోయిన్పల్లి పీఎస్లో నార్త్జోన్అడిషనల్ డీసీపీ మధుసూదన్రావు మీడియాకు వివరాలు వెల్లడించారు.
రాజస్థాన్కు చెందిన జై సింగ్ భాటి (44), రూప్ చంద్ కచవా (27), ప్రేమ్ కుమార్ పర్మార్ (35) కొన్నేండ్ల కిందట బతుకుదెరువు కోసం సిటీకి వచ్చి జీడిమెట్ల ప్రాంతంలోని సుభాష్నగర్లో నివాసం వుంటున్నారు. జైసింగ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తుండగా, రూప్చంద్ కిరాణా షాపు , ప్రేమ్కుమార్ చిన్న వ్యాపారం చేస్తున్నాడు. జైసింగ్, ప్రేమ్కుమార్ ఇద్దరికి వ్యాపారంలో లాభాలు రాకపోవడంతో మరో బిజినెస్ చేయాలనుకున్నారు.
అందు కోసం మెదక్ జిల్లా లోని కుచారంలో ఓ స్థలాన్ని అద్దెకు తీసుకుని అందులో డాంకీ ఫామ్ను నడిపారు. అందులోనూ నష్టపోవడంతో గంజాయి అమ్మేందుకు స్కెచ్ వేశారు. తమ ఫ్రెండ్ రూప్చంద్తో కలిసి గంజాయి సప్లయ్ మొదలుపెట్టారు. సిటీలో గంజాయి వ్యాపారం చేస్తున్న మంగిలాల్ , ధర్మేంద్రతో జైసింగ్, ప్రేమ్ కుమార్, రూప్ చంద్కు 4 నెలల కిందట పరిచయం ఏర్పడింది.
ఈ ముగ్గురు వీరి వద్ద గంజాయిని కొని స్టూడెంట్లకు, యువతకు అమ్మేవారు. పెద్ద మొత్తంలో గంజాయి అమ్మేందుకు ప్లాన్ చేసి మంగిలాల్, ధర్మేంద్రను ఆశ్రయించారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన గంజాయి వ్యాపారి రాజన్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుందని మంగిలాల్, ధర్మేంద్ర ఆ ముగ్గురికి చెప్పారు. దీంతో జైసింగ్, ప్రేమ్ కుమార్, రూప్చంద్ ముగ్గురు కలిసి రాజమండ్రికి వెళ్లి రాజన్ నుంచి 130 కిలోల గంజాయిని కొన్నారు.
రెండు కార్లలో వాటిని తీసుకొని సోమవారం రాత్రి సిటీకి వచ్చారు. దీని గురించి సమాచారం అందుకున్న నార్త్ జోన్ టాస్క్ఫోర్స్, బోయిన్పల్లి పోలీసులు సికింద్రాబాద్లోని డైమండ్ పాయింట్ హోటల్ చౌరస్తాలో వీరి కార్లను అడ్డుకున్నారు. 130 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జైసింగ్, రూప్చంద్, ప్రేమ్కుమార్ను అరెస్టు చేశారు. వీరికి గంజాయి సప్లయ్ చేసిన రాజన్ పరారీలో ఉన్నట్లు అడిషనల్ డీసీపీ మధుసూదన రావు తెలిపారు.