టోక్యో: ఇండియా స్టార్ షూటర్, హైదరాబాదీ ధనుష్ శ్రీకాంత్ మరోసారి తన గురితో అదుర్స్ అనిపించాడు. ప్రతిష్టాత్మక డెఫ్లింపిక్స్ (బధిరుల ఒలింపిక్స్)లో రెండో గోల్డ్తో ఔరా అనిపించాడు. మంగళవారం (నవంబర్ 18) జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మహిత్ సంధుతో కలిసి 23 ఏండ్ల ధనుష్ బంగారు పతకం గెలిచాడు.
గోల్డ్ మెడల్ మ్యాచ్లో ధనుష్–మహిత్ 17–7తో సౌత్ కొరియా జోడీ జియోన్ డైన్–కిమ్ మూరిమ్ను చిత్తుగా ఓడించారు. ఆరంభంలోనే 4–0తో లీడ్ సాధించిన ఇండియా ద్వయం చివరి వరకూ అదే ఆధిపత్యం కొనసాగించింది. ఇదే ఈవెంట్లో మహ్మద్ మూర్తజా వానియా–కోమల్ మిలింద్ వాఘ్మారె కాంస్యం నెగ్గారు.
బ్రాంజ్ మెడల్ పోరులో మూర్తజా–కోమల్ 16–12తో వయోలెటా లైకోవా–ఒలెక్సాండర్ కొస్తిక్ (ఉక్రెయిన్)ను ఓడించారు. ఈ టోర్నీలో ఇండియాకు ఇప్పటివరకు తొమ్మిది మెడల్స్ లభించాయి. ఇప్పటికే 10 మీటర్ల వ్యక్తిగత విభాగంలో వరల్డ్ రికార్డు స్కోరుతో చాంపియన్గా నిలిచిన హైదరాబాదీ ధనుష్ డెఫ్లింపిక్స్లో స్వర్ణాల సంఖ్యను నాలుగుకు పెంచుకున్నాడు. 2022లో జరిగిన గత ఎడిషన్ డెఫ్లింపిక్స్లో కూడా అతను 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో బంగారు పతకాలు గెలిచాడు.
