వెల్లుల్లి, ఉప్పు, ప‌సుపు.. వీటితోనే క‌రోనాకి చైనా చెక్: ఆరోగ్య మంత్రి స‌ల‌హాపై ట్రోలింగ్

వెల్లుల్లి, ఉప్పు, ప‌సుపు.. వీటితోనే క‌రోనాకి చైనా చెక్: ఆరోగ్య మంత్రి స‌ల‌హాపై ట్రోలింగ్

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన క‌రోనా వైర‌స్ యావ‌త్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. దాదాపు నాలుగు నెల‌ల లోపే 24 ల‌క్ష‌ల మందికి పైగా ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ల‌క్షా 65 వేల మందికి పైగా ఈ మ‌హ్మారికి బ‌ల‌య్యారు. క‌రోనా ఒక‌రి నుంచి మ‌రొక‌కిరి వ్యాపించే వ్యాధి కావ‌డం, ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ కానీ, నిర్ధిష్ట‌మైన మందులు కానీ లేక‌పోవ‌డంతో ప్ర‌పంచ దేశాల్లో అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. దీనిని ఎదుర్కొనేందుకు చాలా దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. వైద్యులు కొన్ని ర‌కాల మందుల‌ను వాడుతూ పేషెంట్ల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అన్ని ప్ర‌భుత్వాలు కూడా వ్యాధి వ‌చ్చాక‌ చికిత్స తీసుకునే క‌న్నా అది రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌డ‌మే మేల‌ని ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నాయి. ఇందుకోసం లాక్ డౌన్ ను ప‌క్కాగా పాటించాల‌ని, ఇంటి నుంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్దని కోరుతోంది భార‌త ప్ర‌భుత్వం. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు మంచి ఆహారం తీసుకోవాల‌ని సూచించింది. రోజువారీ ఆహారంలో పాటించాల్సిన జాగ్ర‌త్త‌ల‌తో కేంద్ర ఆయుష్ శాఖ కొన్ని ఇంటి చిట్కాల‌ను కూడా చెప్పింది. అయితే ఇలా ఓ ఇంటి చిట్కానే క‌రోనాకు మందు అని చెప్పి క‌ర్ణాట‌క ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.

వేడి నీళ్ల‌తో వెల్లుల్లి, పసుపు, ఉప్పు.. రోజూ మూడు సార్లు..

క‌ర్ణాట‌క ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరామ‌లు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ క‌రోనాకు ఓ చిట్కా చెప్పారు. వేడి నీళ్ల‌తో వెల్లుల్లి, ప‌సుపు, ఉప్పు క‌లిపి రోజూ మూడు సార్లు తీసుకుంటే క‌రోనా వైర‌స్ కు చెక్ పెట్టొచ్చ‌ని అన్నారు. చైనా కూడా ఇదే ట్రీట్మెంట్ ద్వారా ఈ క‌రోనా మ‌హమ్మారిని క‌ట్ట‌డి చేయ‌గ‌లిగార‌ని చెప్పారాయ‌న‌. ఆయ‌న మాట్లాడిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇంత ఈజీ చిట్కాతో క‌రోనా త‌గ్గిపోయేలా ఉంటే ప్ర‌పంచంలో వేలాది మంది ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజ‌న్లు.

జీనియ‌స్ అంటూ కాంగ్రెస్ సెటైర్

క‌ర్ణాట‌క ఆరోగ్య మంత్రి మాట్లాడిన వీడియోను ట్వీట్ చూస్తూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు కాంగ్రెస్ నేత శ్రీ‌వాత్స‌. క‌ర్ణాట‌క జీనియ‌ర్స హెల్త్ మినిస్ట‌ర్ క‌రోనాకు చెక్ పెట్టే స‌ల‌హా ఇస్తున్నారంటూ ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై సెటైర్ వేశారు.