
‘బిగ్బాస్’ తెలుగు సీజన్ 8 రన్నరప్ గౌతమ్ కృష్ణ హీరోగా వీర జవాన్ మురళీ నాయక్ బయోపిక్ తెరకెక్కబోతోంది. విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్పై కే సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్మెంట్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ ‘తెలుగు సైనికుడి మీద వస్తున్న ఫస్ట్ బయోపిక్ ఇది.
ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నాం. ఇది దేశం గర్వపడే సినిమా అవుతుంది. మురళీ నాయక్ పాత్ర పోషించడం నా అదృష్టం. రియల్ హీరో చరిత్రను గ్రాండ్ స్కేల్లో రూపొందిస్తున్నాం’అని చెప్పాడు.
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ ‘ఇది సినిమా కంటే ఇండియన్ ఎమోషన్. మురళీ నాయక్ జీవితం అందరికీ ఇన్స్పిరేషన్. ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఈ కథ, ఈ సినిమా అందరూ గర్వపడేలా ఉంటుంది’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మురళీ నాయక్ తల్లిదండ్రులు తన కొడుకు బయోపిక్ రూపొందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ భారత్-పాక్ యుద్ధంలో పోరాడుతూ ఆంధ్రప్రదేశ్కు చెందిన మురళీనాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే.