గాజా ఆస్పత్రి దాడి నాకు ఆగ్రహాన్ని కల్గించింది: బైడెన్

గాజా ఆస్పత్రి దాడి నాకు ఆగ్రహాన్ని కల్గించింది: బైడెన్

గాజాలోని అల్ అహిల్ అరబ్ ఆస్పత్రిపై దాడి తనకు ఆగ్రహాన్ని తెప్పించిందని అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ తెలిపారు.ఘటనపై జోర్డాన్ రాజు అబ్దులా 2, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులతో మాట్లాడినట్లు చెప్పారు.  ఈ ఘటన చాలా బాధాకరమని.. వివరాలన్ని సేకరించమని తమ బృందానికి చెప్పానన్నారు.  పౌరుల ప్రాణాల రక్షణకు అమెరికా కట్టుబడి ఉంటుందన్నారు. ఈ ఘోరంపై తమ సంతాపం తెలియజేస్తున్నామన్నారు. 

గాజాలోని అల్ అహ్లీ అరబ్ ఆస్పత్రిపై వైమానిక దాడి జరగడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ  ఘటనలో 500 మందికి పైగా చనిపోయారని    హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ వెల్లడించింది. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయినట్లు తెలిపింది. ఇజ్రాయేలే ఈ దాడికి పాల్పడిందని ఆరోపించింది.  ఇదొక యుద్దంగా పేర్కొంది.  ఆస్పత్రి భవనం పూర్తిగా ధ్వంసం అయి చెల్లాచెదురుగా  పడిన మృతదేహాలున్నట్లు  ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ వో  డైరక్టర్ జనరల్ టెడ్రోస్ ట్వీట్ చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఇజ్రాయెల్​లో బైడెన్ టూర్ 

మరో వైపు  బైడెన్ అక్టోబర్ 18న ఇజ్రాయెల్, జోర్డాన్​లో పర్యటిస్తారు. హమాస్ మిలిటెంట్లపై పోరులో ఇజ్రాయెల్​కు మద్దతు తెలపడంతోపాటు గాజాలోని పాలస్తీనా పౌరులకు మానవతా సాయం అందించడంపై చర్చించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. ‘హమాస్ కిరాతక టెర్రరిస్ట్ దాడికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్​కు అండగా నిలిచేందుకు నేను బుధవారం ఆ దేశానికి వెళ్తున్నా’ అని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు.