‘బోర్డర్’​టచ్​ చేస్తే బాదుడే

‘బోర్డర్’​టచ్​ చేస్తే బాదుడే

జెంటిల్​మెన్ అగ్రిమెంట్​ లేక నష్టపోతున్న ప్రైవేట్​ ట్రావెల్స్​

హైదరాబాద్‌,వెలుగుసరిహద్దు పన్నుతో మ్యాక్సీ క్యాబ్స్, ట్రావెల్స్ డ్రైవర్లు, విజిటర్స్​పరేషాన్​అవుతున్నరు. కాంట్రాక్ట్‌ క్యారేజ్‌లకు పెద్ద మొత్తంలో బోర్డర్‌ ట్యాక్స్‌ విధిస్తుండటంతో బెంబేలెత్తుతున్నారు. ఉమ్మడి ఏపీలో జెంటిల్‌మెన్‌ ఒప్పందం అమలులో ఉండగా పెద్దగా ట్యాక్స్‌ పడేది కాదు. రూ.వెయ్యి నుంచి రూ. రెండు వేల వరకు నామమాత్రపు ఫీజుతో వెళ్లి వచ్చేవారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణ ఈ ఒప్పందం చేసుకోలేదు. దీంతో మన డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. ఏపీ, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలతో తెలంగాణ సర్కార్‌ జెంటిల్‌మెన్‌ ఒప్పందం చేసుకోవడమే దీనికి పరిష్కారమని చెబుతున్నారు.

రాష్ట్ర విభజన నాటి నుంచే..

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి, విజయవాడ కనకదుర్గమ్మ, వైజాగ్​, అరకు లాంటి టూరిస్ట్​ ప్లేస్​లకు ఇక్కడి నుంచి ప్రతిరోజూ ఎంతోమంది వెళ్లి వస్తుంటారు. అలాగే కేరళ, తమిళనాడులకు కూడా వెళతారు. ఎక్కువగా క్యాబ్స్​, ఇతర ప్రైవేట్​ వెహికల్స్​ మాట్లాడుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు ఎలాంటి సరిహద్దు ట్యాక్స్‌ లేదు. రాష్ట్రం ఏర్పడ్డాక మొదట తెలంగాణ ప్రభుత్వమే ఏపీ వాహనాల నుంచి సరిహద్దు పన్ను వసూలు చేయడం ప్రారంభించింది. దీంతో ఏపీ సర్కార్‌ కూడా బోర్డర్‌ ట్యాక్స్‌ వేయడం షురూ చేసింది. దీంతో ఖర్చులకు భయపడి ఆయా ప్లేస్​లకు ప్రైవేట్​ వెహికల్స్​లో వెళ్లి వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. దీనివల్ల ప్రైవేట్​వెహికల్స్​డ్రైవర్లు, యజమానుల ఉపాధికి దెబ్బ పడుతోంది.

ఇట్ల వసూలు చేస్తున్రు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ఇతర రాష్ట్రాలతో జెంటిల్‌మెన్‌ ఒప్పందం ఉండేది. దీనివల్ల ఆయా రాష్ట్రాల్లో వెళ్లేటప్పుడు  రూ.వెయ్యి నుంచి రూ.2వేలు ఎంట్రీఫీజు తీసుకుని, స్టాంప్‌ వేసి అనుమతిచ్చేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇలాంటి ఒప్పందం ఏదీ లేకపోవడంతో తెలంగాణ బండ్లకు ఖర్చు ఎక్కువే అవుతోంది. ప్రస్తుతం ఒక్కో సీటుకు తమిళనాడు 810,  కర్నాటకకు 670, ఏపీ 350, కేరళ 330 చొప్పున వసూలు చేస్తున్నాయి.

జెంటిల్‌మెన్‌ ఒప్పందం చేసుకోవాలి

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పొరుగు రాష్ట్రాలతో జెంటిల్‌మెన్‌ ఒప్పందం ఉండేది. అప్పుడు ఎంట్రీ ఫీజు కడితే ఇతర రాష్ట్రాల్లో ఇబ్బంది ఉండేది కాదు. తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. ఏపీ మాత్రం తెలంగాణ మినహా, దాని పొరుగు రాష్ట్రాలతో జెంటిల్​మెన్​ అగ్రిమెంట్​ పొడిగించుకుంది. ఒప్పందం లేకపోవడం వల్ల తెలంగాణ వెహికల్స్​ బోర్డర్​ టచ్ ​చేస్తే చాలు ఒక్కో సీటుకు 350 తీసుకుంటున్నారు. సర్కారు స్పందించి జెంటిల్‌మెన్‌ ఒప్పందం చేసుకోవాలి.

‑ భీష్మాచారి, ట్రావెల్స్‌ అసోసియేషన్‌ లీడర్‌