రూ. 20 కోట్లు ఊడ్చేస్తున్నరు!..గ్రేటర్ లో రోడ్ల క్లీనింగ్ తక్కువ.. అద్దె ఎక్కువ

రూ. 20 కోట్లు ఊడ్చేస్తున్నరు!..గ్రేటర్ లో రోడ్ల క్లీనింగ్ తక్కువ.. అద్దె ఎక్కువ
  •     బల్దియాలో మొత్తం 35 స్వీపింగ్ మెషీన్లు 
  •     పని చేయకున్నా ఏజెన్సీలకు బిల్లులు
  •     ఒక్కోదానికి రూ. కోటికిపైగా చెల్లింపు
  •     ఏటా బల్దియాకు రూ. కోట్లలో వృథా ఖర్చు
  •     పనితీరుపై కమిషనర్ కు  కార్పొరేటర్ల ఫిర్యాదులు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ సిటీలో మెయిన్ రోడ్లను ఊడ్చే స్వీపింగ్ మెషీన్ల  ధర కంటే  అద్దెను బల్దియా ఎక్కువగా చెల్లిస్తుంది. ఇంత ఖర్చు చేస్తున్నా రోడ్లు క్లీన్ గా ఉండట్లేదు. జీహెచ్ఎంసీలోని అన్ని సర్కిళ్లలో మొత్తం 35 స్వీపింగ్ మెషీన్లు ఉన్నాయి. ఇందులో 17 బల్దియావి. మిగతా 18  అద్దెకు తీసుకుంది. వీటిలో ఏజెన్సీలకు ఒక్కో వాహనానికి ఏడాదికి ఒక కోటి 13 లక్షల 33 వేల 250 రూపాయలు అద్దెగా బల్దియా చెల్లిస్తుంది. ఇలా ప్రతి ఏటా 20 కోట్ల 39 లక్షల 98 వేల 500 రూపాయలు ఖర్చు చేస్తుంది. ప్రతిరోజూ రాత్రి రోడ్లపై ఊడ్చాల్సి ఉంటుంది. కోట్లు ఖర్చు చేస్తున్నా రోడ్లు శుభ్రంగా ఉండట్లేదు.  కిరాయివే ఇలా ఉంటే బల్దియా సొంత వాహనాల పనితీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

కొన్ని ఆఫీసుల్లోంచి బయటకు కూడా తీయడం లేదు. అద్దె వాహనాల స్థానంలో కొత్తవి కొనేందుకు ఒక్కోదానికి దాదాపుగా రూ.60 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ, ఏడాదికి ఒక్కోదానికి ఇంతకు డబుల్ అద్దె  చెల్లిస్తుంది. వాటికి బదులుగా సొంతంగా కొనుగోలు చేస్తే ఖర్చు భారీగా తగ్గనుంది. దీనిపై అధికారులను అడిగితే అన్ని మెషీన్లు పని చేస్తున్నాయని సమాధానం ఇస్తున్నారు. 

వీఐపీ ఏరియాల్లోనే క్లీనింగ్ 

గ్రేటర్ లోని కొన్ని ప్రాంతాల్లోని రోడ్లనే మెషీన్లు క్లీన్​ చేస్తున్నాయి.  తెల్లవారుజామున బడా నేతలు, అధికారులు నివాసముండే ప్రాంతాల్లోనే క్లీన్ చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని వీఐపీల ఇండ్ల పరిధిలోనే క్లీన్ చేసి వెళ్లిపోతున్నారు. కమర్షియల్ కారిడార్లు, మెయిన్ రోడ్లపైనా.. సాధారణ ప్రజలు ఉండే ఏరియాల్లో క్లీనింగ్ పట్టించుకోవడంలేదు. కొన్ని మెషీన్లు సర్కిల్ ఆఫీసుల్లోనే ఉంటున్నాయి. చాలా జోన్లలో ఇలాంటి పరిస్థితి ఉండగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ప్రతిఏటా రూ. కోట్లలో ఖర్చు చేస్తున్నా  జనాలకు ఎలాంటి ప్రయోజనం లేదు. 

అడ్డగోలుగా బిల్లులు 

సొంత వాహనాలతో పాటు ఏజెన్సీ నుంచి అద్దెకు తీసుకున్న స్వీపింగ్ మెషీన్ల  పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదు. డీజిల్ ఎంత వాడుతున్నారనే లెక్కలు లేవు. అద్దెకు తీసుకున్న వాటికి జోనల్ స్థాయిలోనే బిల్లులు అవుతుండగా ఇష్టానుసారంగా చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి వివరాలు సేకరించకుండానే బిల్లులను ఏజెన్సీలకు ఇస్తున్నారు. భారీ వర్షాలు పడినప్పుడు రోడ్లు క్లీన్ చేయకుండానే బిల్లులు చెల్లిస్తుండడం గమనార్హం. గతేడాది వర్షాకాలంలో  ఎల్ బీనగర్ జోన్​లో ఇదే విధంగా బిల్లులు మంజూరు చేయడం ఇందుకు నిదర్శనం. 

వరుసగా ఫిర్యాదులు 

స్వీపింగ్​ మెషీన్ల పనితీరుపై బల్దియా కమిషనర్ కి కార్పొరేటర్లు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. వీటితో  ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. ప్రజాధనాన్ని వృథా చేయొద్దని సూచిస్తున్నారు. కొత్తవి కొనుగోలు చేయాలని పేర్కొంటున్నారు.  గ్రీవెన్స్​ సెల్​ కి కూడా కంప్లయింట్స్​ వస్తున్నాయి. తమ ప్రాంతాల్లో  రోడ్లు ఊడ్చే మెషీన్లు రావడంలేదని, పన్నులు చెల్లిస్తున్న కూడా ఎందుకు పంపడంలేదని అధికారులను ప్రశ్నిస్తున్నారు.