
- క్లారిటీ ఇవ్వని బల్దియా అధికారులు
- 3 నెలలకోసారి సమావేశం పెట్టట్లే
- చివరిది పూర్తయి 4 నెలలు దాటినా మరో మీటింగ్ నిర్వహించలే
- వెంటనే ఏర్పాటు చేయాలంటూ కార్పొరేటర్ల డిమాండ్
- ప్రజా సమస్యలు చర్చకు రావట్లేదని ఆవేదన
- మేయర్, అధికారులను కలిసి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు : బల్దియా కౌన్సిల్మీటింగ్ ఎప్పుడు నిర్వహిస్తానే దానిపై క్లారిటీ లేదు. మూడ్నెళ్లకు ఒకసారి పెట్టాల్సి ఉండగా సక్రమంగా నిర్వహించడంలేదు. కౌన్సిల్ ఏర్పాటై మూడేళ్లు కావస్తున్నా.. ఇప్పటివరకు కేవలం 7 మాత్రమే జరిగాయి. ఇందులో మొదటిది వర్చువల్గా.. మిగతా ఆరు హాల్లో కొనసాగించగా.. ఒక మీటింగ్ నైతే అధికారులే వాకౌట్ చేశారు. ఐదు మీటింగ్ ల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండానే వాయిదా పడ్డాయి. ప్రజల సమస్యలపై చర్చించేందుకు కార్పొరేటర్లకు కూడా పెద్దగా చాన్స్ రాలేదు.
గత కౌన్సిల్ సమావేశాల్లో ఎంతసేపు సభ్యుల మధ్య వాగ్వాదానికే టైమ్ సరిపోయింది. చర్చ జరగనే లేదు. ప్రస్తుత కౌన్సిల్ సమావేశం ఎప్పుడనేదానిపై బల్దియా ఆలోచనే చేయడంలేదు. ఏడో కౌన్సిల్ మీటింగ్ జరిగి నాలుగు నెలలు అవుతుంది. అయితే.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేయలేదని అధికారులు చెబుతున్నప్పటికీ, కొత్త సర్కారు ఏర్పాటై 20 రోజులైనా ఇంకా నోరు విప్పడం లేదు. చివరి సమావేశం పూర్తయి నెలలు కావొస్తున్న కూడా ప్రస్తుత దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. జనరల్ బాడీని కూడా ఏర్పాటు చేయాలని కార్పొరేటర్లు సైతం డిమాండ్ చేస్తున్నారు.
లేకపోతే ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చే అవకాశమే ఉండదని పేర్కొంటున్నారు. వెంటనే కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలని కార్పొరేటర్లు మేయర్ తో పాటు అధికారులను కోరుతున్నారు. ఇటీవల మన్సురాబాద్, మల్కాజిగిరి కార్పొరేటర్లతో పాటు పలువురు మేయర్తో పాటు అధికారులను కలిశారు.
3 నెలకోసారి ఉండగా..
ప్రస్తుత బల్దియా కౌన్సిల్ ఏర్పడి మూడేళ్లు అవుతుంది. మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహిస్తే ఇప్పటికే 12 సార్లు జరిగాలి. కేవలం ఏడుసార్లు మాత్రమే నిర్వహించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలపైనే చర్చకు ముందుకు రావడం లేదు. దీంతో గ్రేటర్ లోని ప్రాబ్లమ్స్ పై చర్చ జరగడం లేదు. వర్షాకాలంలో కనీసం డివిజన్లలోని ఇబ్బందులపై చర్చ కోసమైనా కౌన్సిల్ ఏర్పాటు చేయాల్సి ఉండగా అప్పట్లో చేయలేదు. వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చాలా పనులు పెండింగ్లో ఉన్నాయని, సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. వాటిపై పెద్దగా చర్చ జరగడంలేదు.
హెడ్డాఫీసును ముట్టడించినా..
బల్దియా కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని పలువురు కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కొందరైతే ఆందోళనలకు సైతం దిగారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు మీటింగ్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. దీనిపై పలుమార్లు ప్రతిపక్ష కార్పొరేటర్లు హెడ్డాఫీసుని ముట్టడించి మేయర్ చాంబర్ని సైతం ధ్వంసం చేశారు. అయినా.. సమావేశాలు రెగ్యులర్గా మాత్రం నిర్వహించడం లేదు. ఆ అంశాన్నే పట్టించుకోవడం లేదు. త్వరలో ఏర్పాటు చేయాలంటూ కార్పొరేటర్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు అధికారులను డిమాండ్ చేశారు.