హైదరాబాద్: గత వారం రోజులలో శిథిలావస్థకు చేరిన 65 భవనాలను కూల్చివేసినట్లు జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదల వలన శిథిలావస్థకు చేరిన భవనాలు ఆకస్మికంగా కూలిపోయే అవకాశం ఉన్నందున, అటువంటి నిర్మాణాలలో ఉంటున్న కుటుంబాలు తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయం లేనివారికి కమ్యునిటీహాల్స్లో తాత్కాలిక వసతి కల్పించనున్నట్లు తెలిపారు.
ఇటీవల ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నందున ప్రజల ప్రాణాలను కాపాడుటకు టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత వారం రోజులలో 65 శిథిల భవనాలను కూల్చివేసినట్లు తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న శిథిల భవనాలలో ఉంటున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. వర్షాలు పడుతున్నందున శిథిల భవనాలు ఖాళీ చేయాలని ప్రజలకు కమిషనర్ విజ్ఞప్తి చేశారు