హైదరాబాద్, వెలుగు: సిటీలో అక్రమ కట్టడాలు, ఫుట్ పాత్ ల ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మూసాపేట్ ఏరియాలోని కాముని చెరువు పరిధిలో ఏర్పాటు చేసిన అక్రమ కట్టడాలను బల్దియా అధికారులు కూల్చి వేశారు. ఆ ప్రాంతంలో ఫుట్ పాత్ ల ఆక్రమణలను తొలగించారు. యూసఫ్ గూడలో స్వచ్ఛ తనిఖీలు చేపట్టిన అధికారులు పలు హోటళ్లు, వైన్ షాపుల నిర్వాహకులకు జరిమానా విధించారు. యూనివర్సల్ హోటల్ కు రూ.20 వేలు జరిమానా విధించారు.
కూకట్పల్లి:‘సాఫ్ హైదరాబాద్ షాన్దార్ హైదరాబాద్’ లో భాగంగా మూసాపేట్ సర్కిల్ డీసీ వి. మమత సర్కిల్ పరిధిలోని భరత్నగర్ మార్కెట్ రోడ్డులో పర్యటించారు. మార్కెట్ రోడ్డులో ఉన్న కూరగాయల దుకాణదారులు కూరగాయల వ్యర్ధాలను, చెత్తను మొత్తం రోడ్డు వెంట ఉన్న గోడ పక్కనే పడవేస్తున్నారు. దీంతో బుధవారం డీసీ చెత్త వేస్తున్న వారితోనే వ్యర్థాలను తొలగించి, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి దుకాణదారులతో కలిసి మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా చెత్తను రోడ్లపై వేయకుండా చెత్త బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం బాలాజీనగర్ డివిజన్లో పర్యటించి కాలనీవాసులు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి జీహెచ్ఎంసీ కార్మికులకు అందజేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. బాలాజీనగర్ శివబాలాజీ వైన్స్కు రూ.20 వేలు, పీపుల్స్ బార్ అండ్ రెస్టారెంట్ కు రూ.15వేలు, మాత వైన్స్కు రూ. 5 వేలు, శివ బాలాజీ వైన్స్ పాన్ షాప్కు రూ. 500, మొత్తం రూ. 40,500 ఫైన్లు విధించి వసూలు చేశారు. ఎమ్మార్వో నిర్మల, హార్టికల్చర్ మేనేజర్ మాలినిరెడ్డి, ఎస్ఎస్లు మురళీధర్రెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.