ఎర్లీబర్డ్ తో జీహెచ్ఎంసీకి మస్తు ఆమ్దానీ

ఎర్లీబర్డ్ తో జీహెచ్ఎంసీకి మస్తు ఆమ్దానీ
  •     ఇయ్యాల్టితో ముగియనున్న స్కీమ్
  •     చివరి రోజు రూ.80 నుంచి 90 కోట్లు వస్తుందని అంచనా
  •     ఇప్పటివరకు రూ.710 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్​ వసూలు

హైదరాబాద్, వెలుగు:  ‘ఎర్లీబర్డ్’ స్కీమ్ అమలుతో జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం వచ్చింది. ఎన్నికల సమయంలోనూ ప్రాపర్టీదారుల నుంచి గతంలో ఎన్నడూ లేనంత రెస్పాన్స్​వచ్చింది. ఈ నెల 1 నుంచి సోమవారం రాత్రి వరకు ఎర్లీబర్డ్​స్కీమ్​కింద రూ.710 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్​కలెక్ట్​అయినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. గతేడాది ఏప్రిల్​లో రూ.766 కోట్లు రాగా, ఈసారి రూ.800 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చివరి రోజైన మంగళవారం రూ.80 నుంచి 90 కోట్లు రావచ్చని చెబుతున్నారు. గతేడాది ఏప్రిల్ లో ఎర్లీబర్డ్​కింద రూ.750 కోట్లు టార్గెట్​పెట్టుకోగా, అంతకు మించి వచ్చింది.

ప్రస్తుతం సిబ్బంది అంతా ఎన్నికల హడావిడిలో ఉండడంతో ఈసారి ఎలాంటి టార్గెట్​పెట్టుకోలేదు. అయినప్పటికీ గతేడాదికి మించి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్​లో జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్​ స్కీమ్ ని అమలు చేస్తోంది. దీని కింద ప్రాపర్టీ ట్యాక్స్​చెల్లిస్తే 5 శాతం రిబిట్​వస్తుంది.

ఈసారి 6.58 లక్షల మంది

ఎర్లీబర్డ్ కింద ప్రాపర్టీ ట్యాక్స్​చెల్లించేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. గతేడాది 6లక్షల10వేల మంది సద్వినియోగం చేసుకోగా, ఈసారి ఆ సంఖ్య 6లక్షల58వేలకు చేరింది. రిబిట్ వస్తుండడంతో ప్రాపర్టీదారులు ట్యాక్స్​చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఎర్లీబర్డ్ స్కీమ్ జీహెచ్ఎంసీలో ఎనిమిదేండ్లుగా అమలవుతోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.362 కోట్ల ఆదాయం రాగా, 2018-19లో రూ.432కోట్లు, 2019–20లో రూ.535 కోట్లు, 2020-21లో రూ.572 కోట్లు, 2021-22లో రూ.541 కోట్లు, 2022-23లో రూ.743 కోట్లు, 2023–24లో రూ.766 కోట్లు వసూలయ్యాయి. ఈసారి ఒకరోజు మిగిలి ఉండగానే రూ.710 కోట్ల ఆదాయం వచ్చింది.