ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో..జీహెచ్​ఎంసీ పార్కింగ్

ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో..జీహెచ్​ఎంసీ పార్కింగ్
  •     పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా   ప్లాన్​
  •     లోక్​సభ ఎన్నికల తర్వాత కాంప్రహెన్సివ్ పార్కింగ్ పాలసీ అమల్లోకి.. 
  •      ఇప్పటికే పలుచోట్ల ఖాళీ స్థలాలు గుర్తింపు
  •     ఎలక్ట్రానిక్ వెహికల్స్​కు 10 శాతం డిస్కౌంట్
  •     నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్
  •     చాలా తక్కువ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయం
  •     ప్రైవేట్ ​వ్యక్తులు నిర్వహణకు ముందుకొస్తే పర్మిషన్లు, ట్యాక్స్​లో మినహాయింపు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​పరిధిలో పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టాలని జీహెచ్ఎంసీ ప్లాన్​చేస్తోంది. ఇందులో భాగంగా ‘కాంప్రహెన్సివ్ పార్కింగ్ పాలసీ’ని తీసుకురాబోతుంది. సిటీలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా పార్కింగ్ స్పేస్​ఉండడం లేదు. దీంతో బల్దియానే ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో ‘మల్టీ లెవల్ పార్కింగ్’ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని చూస్తోంది. పార్కింగ్​ఏర్పాటుకు స్థలాన్ని లీజుకు ఇవ్వడంతోపాటు ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా పార్కింగ్​నిర్వహణకు ముందుకొస్తే ప్రోత్సహించేందుకు రెడీగా ఉంది.

ఆయా స్థలాల్లో అడ్వటైజ్ మెంట్లకి కూడా అనుమతులు ఇవ్వనుంది. ఇందుకోసం పార్కింగ్​నిర్వాహకుడు జీహెచ్ఎంసీకి కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పార్కింగ్ కలెక్షన్ లో కొంత బల్దియాకి కట్టాల్సి ఉంటుంది. బిల్డింగ్స్​లోని ఖాళీ జాగాలో ప్రైవేట్ వ్యక్తులు పార్కింగ్ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొస్తే పర్మిషన్​ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు.

ఆస్తి పన్నులో కొంత మినహాయింపు కూడా ఇవ్వనున్నారు. ఇక ప్రభుత్వ స్థలాల్లో పార్కింగ్ ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను టెండర్ల ద్వారా ఏజేన్సీలకు అప్పగించనున్నారు. మెయిన్​రోడ్ల పక్కన ఉన్న ఖాళీ జాగాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. ప్రస్తుతానికి పార్కింగ్​ఫీజులు ఇంకా డిసైడ్​చేయలేదు. అయితే ప్రస్తుతం నడుస్తున్న ప్రైవేట్​వాటికంటే చాలా తక్కువగా ఉంటాయని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. 

చకచకా పనులు.. 

కొద్దిరోజులుగా జీహెచ్ఎంసీ కొత్త పార్కింగ్​పాలసీపై కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై10 రోజుల కింద బల్దియా కమిషనర్ రోనాల్డ్​రోస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఆ వెంటనే మల్టీలెవల్​పార్కింగ్ ఏర్పాటుకు పనులు మొదలుపెట్టారు. లోక్​సభ ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త పాలసీని అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, 45, సికింద్రాబాద్ జనరల్ బజార్, హై-టెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్  తదితర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటుకు స్థలాలు గుర్తించారు. త్వరలో కేబీఆర్ పార్క్​వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 72 కార్లు, వంద బైకులు నిలిపేందుకు వీలుండనుంది. ఇంకా చాలాచోట్ల స్థలాల వేట, పరిశీలన కొనసాగుతోంది. 

ఈ–వెహికల్స్​కు డిస్కౌంట్

గతంలో జేఎన్​టీయూ ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేసిన మాదిరిగా అవసరమైన చోట స్మార్ట్ పార్కింగ్ పెట్టనున్నారు. వాహనదారులకు స్మార్ట్ కార్డులు అందిస్తారు. ఇన్, ఔట్​టైంలో కార్డుతో యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఆటో మెటిక్ గా స్మార్డ్ కార్డులోంచి మనీ కట్ కానుంది. ఈ సదుపాయంతో టైమ్ సేవ్​అవుతుంది. అలాగే పార్కింగ్ స్థలాల నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ అందుబాటులోకి తేనున్నారు. పార్కింగ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అందులో తెలిసేలా ఫీచర్లు ఉంచనున్నారు. అలాగే సిటీలో పొల్యూషన్​తగ్గించేందుకు ఈ–వెహికల్స్ ని ప్రొత్సహించాలని బల్దియా ప్లాన్ చేస్తోంది. కొత్త పార్కింగ్​ స్పేస్​లో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ కు 10 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది.

తార్నాకలో రైల్వే పార్కింగ్..

సౌత్ సెంట్రల్ రైల్వే కూడా పార్కింగ్ పై దృష్టి పెట్టింది. రైల్వేస్టేషన్లతోపాటు స్టేషన్ లేని చోట కూడా పార్కింగ్ ఏర్పాటు చేస్తోంది. తార్నాక రైల్వే డిగ్రీ కాలేజీ పక్కనున్న రైల్వే గ్రౌండ్ లో మూడు నెలల కింద్​పార్కింగ్ స్పేస్​ను అందుబాటులోకి తెచ్చింది. నిర్వహణ బాధ్యతలను ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది. ఇందులో ఎవరైనా వెహికల్స్ పార్క్ చేయొచ్చు. పార్కింగ్ ఫీజులు కూడా ప్రైవేట్ వాటి​కంటే తక్కువగానే ఉన్నాయి. టూ వీలర్ కి మొదటి రెండు గంటల కోసం రూ.12; రెండు నుంచి ఆరు గంటలకైతే రూ.24; ఆరు నుంచి 12 గంటల వరకు అయితే రూ.36; 12 నుంచి 24 గంటలకు అయితే రూ.70 కలెక్ట్ చేస్తున్నారు. ఫోర్ వీలర్ కి కూడా బయటి ఫీజులతో పోలిస్తే ఇక్కడ తక్కువగా ఉన్నాయి.