ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన గిడుగు రుద్రరాజు డిసెంబర్ 9న బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే తన ప్రమాణం స్వీకారానికి హాజరుకావాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను రుద్రరాజు ఆహ్వానించారు. హైదరాబాద్ కు వచ్చిన రుద్రరాజు, పొన్నాలను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రుద్రరాజుకు పొన్నాల కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో పనిచేసిన రుద్రరాజును అధిష్టానం గుర్తించి ఏపీ పీసీసీ చీఫ్ గా అవకాశం కల్పించడం అభినందనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రుద్రరాజుకు పొన్నాల సూచించారు.
తన సేవలను గుర్తించి పీసీసీ అధ్యక్షునిగా అవకాశం ఇచ్చిన పార్టీ అధిష్టానానికి, మల్లికార్జున ఖర్గేకు రుద్రరాజు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు పరిపాలనాపరంగానే విడిపోయాయన్న ఆయన... పార్టీ బలోపేతానికి తెలంగాణ నాయకుల సలహాలు, సూచనలు సైతం తీసుకుంటానని చెప్పారు. ఇక ఇటీవలే ఏపీసీసీ చీఫ్ గా శైలజానాథ్ ను తప్పిస్తూ గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.