
కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎంలపై ఎంపీ ఫైర్
హైదరాబాద్, వెలుగు: సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ), నేషనల్పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్) లను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఒక్క కారణమన్నా చెప్పాలంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్షాలను ఎంపీ బండి సంజయ్ నిలదీశారు. ఈ వ్యతిరేక ఆందోళనలన్నీ దేశద్రోహుల కుట్రేనని ఆయన ఆరోపించారు. అస్సాం వంటి రాష్ట్రాల్లో ఇస్లామిక్ దేశాల నుంచి వస్తున్న నిధులతో విపక్షాలు ఆందోళనలు జరిపిస్తుండగా.. మన రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ డబ్బులిచ్చి ఆందోళనలు చేయిస్తోందని ఆరోపించారు. హిందువులకు తాము వ్యతిరేకం కాదని నిజామాబాద్ సభలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించడం కంటితుడుపు చర్యేనని విమర్శించారు. హిందువులపై వ్యతిరేకత లేకుంటే దేశంలో 15 నిమిషాలు తప్పుకుంటే హిందువులను అంతం చేస్తామన్న కామెంట్కు అర్థమేమిటని అడిగారు. ఇక లౌకిక పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్.. సీఏఏ, ఎన్పీఆర్ లను ఎందుకు వ్యతిరేకుస్తోందని ప్రశ్నించారు. భరతమాతకు జై కొట్టని పార్టీలు కూడా దేశం గురించి మాట్లాడడం విడ్డూరమని మండిపడ్డారు. జాతీయ జెండా ఎగరవేయను, జనగణమన పాడనన్న అసద్.. మోడీ పాలన విధానాలతో దిగిరాక తప్పలేదని చెప్పారు.