- కరెంట్, ఇంటర్నెట్ నిరంతరం ఉండాలి
- ఎయిర్పోర్ట్ నుంచి సమిట్ వరకు రోడ్లన్నీ క్లీన్గా ఉండాలి
- అడిషనల్ డీజీ చౌహాన్, రాచకొండ సీపీ సుధీర్బాబు
ఎల్బీనగర్/ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే గ్లోబల్ సమిట్ కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. సమిట్ ఏర్పాట్లపై సోమవారం అడిషనల్ డీజీ డీఎస్ చౌహాన్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంకతో కలిసి అన్ని విభాగాల హెచ్ఓడీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సదుపాయాలను కల్పించాలని అధికారులకు సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావు ఉండొద్దని, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యంలో అంతరాయం లేకుండా చూడాలన్నారు.
రవాణా సౌకర్యం, తాగునీరు, టాయిలెట్లు, హెలిప్యాడ్లు, పార్కింగ్ స్థలాలకు ప్లాన్ ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు. ఎయిర్పోర్టు నుంచి గ్లోబల్ సమిట్ వరకు రోడ్లు క్లీన్గా ఉంచాలన్నారు. ఈ సమావేశంలో మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ప్రొటోకాల్ సెక్రటరీ నర్సింహారెడ్డి, అధికారులు ప్రేమ్ రాజ్, వాటర్ బోర్డ్ ఎండీ కె.అశోక్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్ అండ్ బీ, ఫైర్ సేఫ్టీ, ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, టీజీఎస్పీడీసీఎల్, టూరిజం, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
