
న్యూఢిల్లీ : జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ జీఎంఆర్ ఎయిర్ పోర్స్ట్ గ్రీసులోని క్రీట్ ద్వీపంలో విమానాశ్రయం నిర్మించడానికి స్థానిక కంపెనీ టెర్నా గ్రూప్ తో జతకట్టింది. ఇందుకోసం ఈ రెండు కంపెనీలు గ్రీస్ ప్రభుత్వంతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం తమ కన్షార్షి యం 500 మిలియన్ యూరోలు (దాదాపు రూ.4,038 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తుందని జీఎంఆర్ గ్రూపు శుక్రవారం ప్రకటించింది. ఎయిర్ పోర్ట్ డిజైన్, కన్ స్ట్రక్షన్, ఫైనాన్సగ్, ఆపరేషన్, మెయింటనెన్స్ కోసం ఒప్పందం చేసుకున్నామని తెలిపింది.
కన్సెషన్ వ్యవధి 35 ఏళ్లు కాగా, తొలిదశ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఐదేళ్లు పడుతుంది. ప్రస్తుత ఎయిర్ పోర్ట్ ద్వారా అందిన నిధులు, ఈక్విటీ, గ్రీస్ ప్రభుత్వ గ్రాంటును ఈ ప్రాజెక్టు కోసం ఉపయోగించుకుంటామని, బయటి నుంచి అప్పులు తీసుకోబోమని జీఎంఆర్ ఇన్ఫ్రా తెలిపింది. యూరోపియన్ యూనియన్ లో జీఎంఆర్ చేపడుతున్న మొట్టమొదటి ప్రాజెక్టు ఇది. ఈ ప్రాంతంలో కార్యకలాపాల విస్తరణకు ఆసక్తితో ఉన్నామని కంపెనీ ప్రకటించింది.