మంగపేట, వెలుగు: కరకట్ట పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఇరిగేషన్క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీర్ వెంకటకృష్ణ అన్నారు. సోమవారం ఆయన ములుగు జిల్లా మంగపేట మండలం గంపనిగూడెంలో జరుగుతున్న గోదావరి కరకట్ట పనులను పరిశీలించారు. కమలాపురం నుంచి పొదుమూరు పుష్కరఘాట్ వరకు 2.5 కిలో మీటర్ల గోదావరి ఒడ్డుకు కరకట్ట నిర్మాణానికి ప్రభుత్వం రూ.60 కోట్లతో పనులు ప్రారంభించగా, 2025 జూన్లో వర్షాల కారణంగా పనులు నిలిచిపోయాయి.
ఇటీవల పనులు ప్రారంభం కాగా, చీఫ్ ఇంజినీర్ ఇరిగేషన్ ఈఈ శంకరయ్య, ఫీల్డ్ స్టాఫ్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన మెటీరియల్ తో పాటు అదనంగా స్కిల్ లేబర్ ను పెంచాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ బుచ్చిరెడ్డి, ఈఈ బాలకృష్ణ, ఇరిగేషన్ ములుగు ఎస్ఈ మోహన్రావు, ఇరిగేషన్ ఏటూరునాగారం ఈఈ శంకరయ్య, డీఈ రవికుమార్, ఏఈ వలీ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
