
- వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
జూలూరుపాడు, వెలుగు: గోదావరి జలాలను జూలూరుపాడు, ఏన్కూర్, మండల రైతులతో పాటు వైరా రిజర్వాయర్కు తరలించి మాట నిలబెట్టుకుంటున్నామని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని వినోభానగర్ రాజీవ్ కెనాల్ వద్ద పూజలు చేసి గేట్లు ఎత్తి వైరా రిజర్వాయర్కు నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైరా నియోజకవర్గంలోని మూడు మండలాల రైతులకు మేలు చేకూర్చే విధంగా కాలువ డిజైన్ చేయించామన్నారు. 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు.
రానున్న రోజుల్లో జూలూరుపాడు, ఏన్కూరు మండలాలకు సుమారు 35 వేల ఎకరాలకు, వైరా రిజర్వాయర్ నుంచి కొణిజర్ల మండలాలకు సుమారు 25 వేల ఎకరాలకు పిల్ల కాలువల ద్వారా సాగు నీటిని అందిస్తామన్నారు. గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా నాయకులు రాజశేఖర్, లేళ్ళ వెంకటరెడ్డి, మండల అధ్యక్షుడు మంగీలాల్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.