చార్మినార్, వెలుగు: ఆషాఢ మాసం బోనాల జాతర జులై 16న ప్రారంభమవుతుందని భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ మల్యాల మధుసూదన్ యాదవ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జులై 16న గోల్కొండ జగదాంబ అమ్మవారికి బంగారు బోనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
జులై 19న జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లికి, 22న బల్కంపేట ఎల్లమ్మ, 26న విజయవాడ కనకదుర్గమ్మ, 30న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, ఆగస్టు 4న చార్మినార్ భాగ్యలక్ష్మి, 6న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవార్లకు బంగారు బోనాలను సమర్పించనున్నట్లు వివరించారు. జూబ్లీహిల్స్ అమ్మవారికి సమర్పించే బంగారు బోనానికి ముందు అదే రోజు ఉదయం.. హరిబౌలీలోని బంగారు మైసమ్మకు బోనం సమర్పించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బోనాన్ని సమర్పిస్తామని పేర్కొన్నారు.
