- క్యూ2 లో గిరాకీ 158.10 టన్నులే
- 18 క్యారెట్ల ప్రొడక్టుల డిమాండ్ పెరుగుతోంది
- డబ్ల్యూజీసీ రిపోర్టు
న్యూఢిల్లీ: బంగారం రేట్లు రికార్డు లెవెల్కు పెరగడంతో ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో దేశీయంగా డిమాండ్ తగ్గింది. ఏప్రిల్–జూన్ 2023 మధ్యలో ఇండియాలో గోల్డ్ డిమాండ్ ఏడు శాతం తగ్గి 158.10 టన్నులకు పరిమితమైనట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) రిపోర్టు వెల్లడించింది. ఇదే సమయంలో అంటే ఏప్రిల్–జూన్మధ్యలోనే బంగారం దిగుమతులు మాత్రం 16 శాతం ఎగసి 209 టన్నులకు చేరినట్లు పేర్కొంది. 2023 మొదటి ఆరు నెలల్లో బంగారం గిరాకీ 271 టన్నులుగాను, పూర్తి ఏడాదికి 650 నుంచి 700 టన్నులుగాను ఉంటుందని డబ్ల్యూజీసీ రిపోర్టు అంచనా వేసింది.
బంగారం రేట్లలో తక్కువ కాలంలోనే బ్రహ్మాండమైన ర్యాలీ వచ్చింది. దీంతో 10 గ్రాముల బంగారం మన దేశంలో రూ. 64 వేలకు చేరుకుందని సోమసుందరం చెప్పారు. విలువపరంగా చూస్తే క్యూ2 లో బంగారపు డిమాండ్ రూ. 82,520 కోట్లు. అంతకు ముందు ఏడాది క్యూ2 లోని రూ. 79,270 కోట్లతో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువని అన్నారు. మొత్తం బంగారం డిమాండ్లో జ్యుయెలరీ డిమాండ్ 8 శాతం తగ్గి 128.6 టన్నులకు పడిపోయిందని డబ్ల్యూజీసీ రిపోర్టు తెలిపింది. ఇండియాలో 18 క్యారెట్ల బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. తక్కువ రేట్లుండటం వల్ల 18 క్యారెట్ల ప్రొడక్టుల పట్ల కన్జూమర్లు ఆకర్షితులవుతున్నారని రిపోర్టు వివరించింది. దేశంలో బంగారం కడ్డీలు, నాణేల గిరాకీ కూడా కొద్దిగా తగ్గినట్లు పేర్కొంది. ధరల పెరుగుదల ప్రకారం చూస్తే బంగారం గిరాకీ భారీగా పడిపోయి ఉండాల్సిందని, కానీ, ఎకనమిక్ కండిషన్లు అనుకూలంగా ఉండటం వల్లే ఆ మాత్రమేనా నిలబడిందని డబ్ల్యూజీసీ రిపోర్టు వెల్లడించింది. రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ప్రభావం రెండో క్వార్టర్లో బంగారం డిమాండ్పై కొంత కనబడిందని కూడా పేర్కొంది. దేశంలో గోల్డ్ రీసైక్లింగ్ ఏప్రిల్–జూన్ క్వార్టర్లో 61 శాతంపెరిగి 37.60 టన్నులకు చేరినట్లు రిపోర్టు తెలిపింది.
అధిక రేట్ల వల్ల క్యూ2 లో బంగారం డిమాండ్ ఏడు శాతం తగ్గింది. కన్జూమర్ సెంటిమెంట్పై అధిక రేట్ల ప్రభావం పడింది.
- పీ ఆర్ సోమసుందరం,
సీఈఓ , డబ్ల్యూజీసీ ఇండియా.