బిజినెస్ డెస్క్, వెలుగు: పండుగ సీజన్ స్టార్టయ్యింది. ఇలాంటి టైమ్లో గోల్డ్ ధరలు ఏడు నెలల కనిష్టానికి పడిపోయాయి. ఫలితంగా దేశంలో గోల్డ్ డిమాండ్ పెరుగుతుందని నిపుణులు భావిస్తు న్నారు. పండుగ టైమ్లో గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేయడం ఇండియాలో సాధారణమని చెప్పొచ్చు. ప్రతీ ఏడాది అక్టోబర్ – డిసెంబర్ మధ్య గోల్డ్ కొనుగోళ్లు బాగా జరుగుతాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో పసిడి డిమాండ్ 12 శాతం పడిపోగా, చివరి ఆరు నెలల్లో డిమాండ్ బాగుందని ఎనలిస్టులు వెల్లడించారు. దీంతో గోల్డ్ దిగుమతులు పెరుగుతాయని, ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువవుతుందని అన్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల గోల్డ్ ధర (24 క్యారెట్లు) బుధవారం నాటికి సుమారు రూ.59,400 పలుకుతోంది. ఈ ఏడాది మే 15 న ఇది రూ.64 వేల లెవెల్ను టచ్ చేసింది.
బంగారం ధర 7 శాతం డౌన్
‘మొత్తంగా చూస్తే గోల్డ్ డిమాండ్ పెరిగింది. మంచి టైమ్లో బంగారం ధరలు తగ్గాయి’ అని సెన్కో గోల్డ్ లిమిటెడ్ ఎండీ సువంకర్ సెన్కో పేర్కొన్నారు. జ్యుయెలరీ స్టోర్లకు కన్జూమర్లు రావడం పెరిగిందని చెప్పారు. కిందటేడాది పండుగ సీజన్తో పోలిస్తే ఈ ఏడాది స్టోర్లకు వచ్చేవారు 10 శాతం నుంచి 15 శాతం పెరిగారన్నారు. ఈ ఏడాది మే నెలలో టచ్ చేసిన రేట్ల నుంచి గోల్డ్ ధర 7 శాతం దిగొచ్చింది. కాగా, గోల్డ్ వినియోగంలో ఇండియా రెండో స్థానంలో ఉంది.
ప్రస్తుతం ఇజ్రాయెల్– హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. మిడిల్ ఈస్ట్లో జియో పొలిటికల్ టెన్షన్స్ పెరిగాయి. అయినప్పటికీ గోల్డ్ ధరలు పెద్దగా పెరగలేదు. ఫెడ్ వడ్డీ రేట్లను మరింత కాలం పాటు గరిష్టాల్లోనే కొనసాగిస్తుందనే అంచనాలతో యూఎస్ బాండ్ ఈల్డ్లు 16 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. డాలర్ వాల్యూ బలపడుతోంది. దీంతో గోల్డ్ డిమాండ్ పడిపోతోందని, అందుకే జియో పొలిటికల్ టెన్షన్లు ఉన్నా బంగారం ధరలు పెరగడం లేదని ఎనలిస్టులు చెబుతున్నారు.
మొదటి ఆరు నెలల్లో డిమాండ్ అంతంతే
డిమాండ్ బాగుండడంతో నగల కంపెనీల షేర్లు దూసుకుపోతున్నాయి. కళ్యాణ్ జ్యుయెలర్స్ షేరు ఈ నెలలో ఇప్పటి వరకు 15 శాతం ఎగసింది. త్రిభువన్దాస్ భీమ్జీ ఝావేరీ లిమిటెడ్ షేర్లు 5 శాతం, టాటా గ్రూప్ కంపెనీ టైటాన్ షేర్లు 4 శాతం మేర లాభపడ్డాయి. ఈ ఏడాది జులైలో మార్కెట్లో లిస్టింగ్ అయిన సెన్కో షేర్లు ఈ నెలలో రెండింతలు పెరిగాయి. ఈ ఏడాది ఇండియా గోల్డ్ డిమాండ్ 650 టన్నులకు పడిపోతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఈ ఏడాది ఆగస్టులో అంచనావేసింది.
డిమాండ్ చేరుకోవడానికి 750 టన్నుల గోల్డ్ అవసరమవుతుందని గతంలో ఈ సంస్థ లెక్కించింది. ఒకవేళ గోల్డ్ డిమాండ్ 650 టన్నులకు పడిపోతే 2020 కరోనా సంక్షోభం తర్వాత ఇదే అతి తక్కువ అవుతుంది. కిందటేడాది గోల్డ్ డిమాండ్ (దిగుమతులు) 774 టన్నులుగా రికార్డయ్యింది. ఈ ఏడాది జులై – సెప్టెంబర్ క్వార్టర్కు గాను డేటాను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిలీజ్ చేయనుంది. పూర్తి ఏడాదికి గల డిమాండ్ అంచనాలను ప్రకటించే అవకాశం ఉంది.
గతంలో బంగారం డిమాండ్ పడిపోతుందనే అంచనాలకు విరుద్ధంగా ఇప్పుడు డిమాండ్ పెరుగుతుండడం చూస్తున్నామని మెటల్స్ ఫోకస్ లిమిటెడ్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ చిరాగ్ శేఠ్ అన్నారు. 2022 తో పోలిస్తే ఈ ఏడాది బంగారం డిమాండ్ ఫ్లాట్గా ఉంటుందని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గరే గోల్డ్ ధరలు దీపావళి వరకు కొనసాగితే సేల్స్ పెరగడం చూడొచ్చు’ అని వెల్లడించారు. గ్లోబల్గా గోల్డ్ ధరలు తగ్గినా, డాలర్ మారకంలో రూపాయి విలువ పడిపోవడంతో బంగారం మరీ ఎక్కువ తగ్గకపోవచ్చని చెప్పారు.