- జీసీసీలతో 2030 నాటికి 13 లక్షల జాబ్స్
- 34.6 లక్షలకు చేరనున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య
- 2026 నాటికి 24 లక్షలకు చేరే చాన్స్
- ఎన్ఎల్బీ సర్వీసెస్ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: మనదేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీలు) ద్వారా రాబోయే ఐదేళ్లలో కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. జీసీసీల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో వీటిలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 2026 నాటికి 24 లక్షలకు, 2030 నాటికి 34.6 లక్షలకు చేరుకుంటుందని ఒక రిపోర్ట్ వెల్లడించింది. గ్లోబల్ టెక్నాలజీ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎన్ఎల్బీ సర్వీసెస్ రిపోర్ట్ ఈ విషయాలను వెల్లడించింది. ఉద్యోగుల సంఖ్య 2026 నాటికి 24 లక్షలకు చేరుతుంది.
రాబోయే ఐదేళ్లలో జీసీసీ ఉద్యోగుల సంఖ్య 30 శాతం పెరుగుతుంది. ఏఐ టెక్నాలజీలకు డిమాండ్ పెరుగుతుండటంతో సైబర్ సెక్యూరిటీ ఏఐ గవర్నెన్స్ ఆర్కిటెక్ట్స్ (29 శాతం), ప్రాంప్ట్ ఇంజనీర్స్ (26 శాతం), జెన్ ఏఐ ప్రొడక్ట్ ఓనర్స్ (22 శాతం), ఏఐ పాలసీ రిస్క్ స్ట్రాటజిస్ట్స్ (21 శాతం) వంటి కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. ఎల్1 ఐటీ సపోర్ట్ (75 శాతం), లెగసీ అప్లికేషన్ డెవలప్మెంట్ (74 శాతం), మాన్యువల్ క్యూఏ (72 శాతం), ఆన్-ప్రెమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ (67 శాతం) వంటి జాబ్స్ను తొలగిస్తున్నారు. జీసీసీలు ఏఐ-నేటివ్, ప్రొడక్ట్- ఓరియెంటెడ్ టీమ్ల వైపు మళ్లుతుండటమే ఇందుకు కారణం.
చిన్న నగరాలకూ విస్తరణ
ఏఐ టెక్నాలజీల వాడకం పెరుగుతుండటంతో టైర్ 2, టైర్ 3 నగరాలకూ జీసీసీలు వస్తున్నాయి. 10–-12 శాతం తక్కువ అట్రిషన్ (రాజీనామా) రేట్లు, 30–-50 శాతం తక్కువ ఆఫీస్ ఖర్చులు, 20–-35 శాతం తక్కువ టాలెంట్ఖర్చు వంటి ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి జీసీసీలు మెట్రో నగరాల నుంచి చిన్న నగరాలకు మారుతున్నాయి.
"2030 నాటికి, జీసీసీ ఉద్యోగులలో దాదాపు 39 శాతం టైర్ 2 టైర్ 3 నగరాల నుంచి పనిచేస్తారు. టైర్– 1 నగరాలు లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్, ఆర్ అండ్ డీ కేంద్రాలుగా పనిచేయడం కొనసాగిస్తాయి. కోయంబత్తూర్,అహ్మదాబాద్, భువనేశ్వర్ వంటివి డెలివరీ కేంద్రాలుగా మారుతున్నాయి’’ అని ఎన్ఎల్బీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వరుణ్ సచ్దేవ వివరించారు.
