- 80 మందిని తీసేసిన డంజో
- 500 మంది వరకు షేర్చాట్ ఉద్యోగులు ఇంటికే
- ఇదే బాటలో అగ్రీటెక్ స్టార్టప్లు కూడా
బిజినెస్ డెస్క్, వెలుగు: కిందటేడాది 18 వేల మందికి పైగా ఉద్యోగులను తీసేసిన టెక్ స్టార్టప్లు, ఈ ఏడాది కూడా లేఆఫ్స్కు రెడీ అవుతున్నాయి. రీస్ట్రక్చరింగ్ చేస్తున్నామనో లేదా ఖర్చులు తగ్గించుకునేందుకనో ఈ ఏడాది భారీగా ఉద్యోగులను తీసేయాలని చూస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన డంజో కిందటి వారం 60–80 మందిని తొలగించింది. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తీసేయాల్సి వచ్చిందని పేర్కొంది. మరో టెక్ కంపెనీ షేర్చాట్ కూడా మరో రౌండ్ లేఆఫ్స్ తప్పవని ప్రకటించింది. షేర్చాట్ పేరెంట్ కంపెనీ మొహల్లాటెక్ కిందటి నెలలో 100 మందిని తీసేయగా, రెండో రౌండ్లో 500 మంది వరకు తొలగించింది. అంతేకాకుండా ఉద్యోగులకు ఇచ్చే డైలీ మీల్స్ కూపన్లను కూడా ఆపేయాలని చూస్తోంది. కంపెనీ తన క్లౌడ్ డీల్స్ను మరోసారి పరిశీలిస్తోందని, ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేపట్టిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. కంపెనీ తన ఉద్యోగుల్లో 20 శాతం మందిని ఇంటికి పంపించేస్తోందని చెప్పారు. బెహరూజ్ బిర్యానీ, ఒవెన్ స్టోరీ వంటి రెస్టారెంట్లను ఆపరేట్ చేస్తున్న క్లౌడ్ కిచెన్ కంపెనీ రెబల్ ఫుడ్స్ కూడా ఉద్యోగులను తీసేస్తామని ప్రకటించింది. కానీ, ఈ కంపెనీ సరిగ్గా పనిచేయని ఉద్యోగులను తీసేస్తామని పేర్కొంది. ‘ఉద్యోగుల యాన్యువల్ పెర్ఫార్మెన్స్ను విశ్లేషిస్తాం. ఆర్గనైజేషన్లో రీస్ట్రక్చరింగ్ చేపడతాం’ అని రెబల్ ఫుడ్స్ స్పోక్స్పర్సన్ వెల్లడించారు. వీటితో పాటు కొత్త ఏడాదిలోకి ఎంటర్ అయ్యే ముందు క్యాష్ఫ్రీ, మోగ్లిక్స్ వంటి స్టార్టప్లు తమ ఉద్యోగులను పెద్ద మొత్తంలో తీసేశాయి. అమెజాన్ కూడా ఇండియాలో 1,000 మందిని తొలగించింది. గత ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఎకానమీలో వచ్చిన మార్పుల వలన లేఆఫ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు.స్టార్టప్లు, ఇతర టెక్ కంపెనీలు ఫండింగ్ సేకరించడంలో ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ఈ ఏడాది మార్చి వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని, ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు రావొచ్చని అంచనావేశారు.
అగ్రిటెక్ స్టార్టప్లలోనూ..
అగ్రిటెక్ స్టార్టప్లలో కూడా లేఆఫ్స్ మొదలయ్యాయి. ఫండింగ్ బాగా అందడంతో 2021లో ఒక వెలుగువెలిగిన ఈ స్టార్టప్లు, కిందటేడాది నుంచి ఇబ్బందులు పడుతున్నాయి. టీమ్సెక్ ఇన్వెస్ట్ చేసిన డీహాట్ తమ ఉద్యోగుల్లో 5 % మందిని(100 మంది వరకు) కిందటేడాది తొలగించింది. అంతేకాకుండా ఈ స్టార్టప్ మరోరౌండ్ లేఆఫ్స్కు సిద్ధమవుతోంది. గ్రామఫోన్ కిందటేడాది నవంబర్, డిసెంబర్ టైమ్లో 75 మంది ఉద్యోగులను తీసేసింది. కెప్టెన్ ఫ్రెష్ తన బిజినెస్ను డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్కు మారుస్తోంది. దీంతో లోకల్గా 120 మంది తమ ఉద్యోగాలు కోల్పోనున్నారు. రైతులకు ఏఐ ఆధారిత సేవలను అందించే భారత్అగ్రి కిందటేడాది ఆగస్టులో 40 మందిని తీసేయగా, తాజాగా మరో 52 మందిని తొలగించింది. అగ్రిటెక్ స్టార్టప్లు సాధించిన ఫండింగ్లో 63 % గత రెండేళ్లలోనే వచ్చిందని ఎనలిస్టులు అన్నారు. 2021లో సుమారు 45 అగ్రిటెక్ స్టార్టప్లు 1.22 బిలియన్ డాలర్లను, 2022 లో 30 అగ్రిటెక్ స్టార్టప్లు 796 మిలియన్ డాలర్లను ఆకర్షించాయన్నారు.
మళ్లీ తీసేస్తారా?
కిందటేడాది టెక్ స్టార్టప్లు తమ ఉద్యోగులను భారీగా తగ్గించుకున్న విషయం తెలిసిందే. బైజూస్ 2,500 మందిని, ఓలా 2,300 మందిని తొలగించింది. బ్లింకిట్ 1,600 మందిని, అన్అకాడమీ 1,500 మందిని, వేదాంతు 1,109 మందిని తీసేశాయి. వైట్హ్యాట్ జూనియర్ 1,300 మంది ఉద్యోగులను, కార్స్24 600 మందిని, ఎంఫైన్ 600 మందిని, ఓయో 600 మందిని, ఉడాన్ 530 మందిని తీసేశాయి. ఎక్కువ మంది ఉద్యోగులను ఎడ్యుటెక్ కంపెనీలే తొలగించాయి. ఈ ఏడాది కూడా పరిస్థితులు మెరుగవ్వకపోతే మరో రౌండ్ లేఆఫ్స్ను ఇవి చేపట్టే అవకాశం ఉంది.