న్యూఢిల్లీ: గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్తో ఇంటిగ్రేషన్కు మన డెవలపర్లకు ఇచ్చిన గడువును గూగుల్ పొడిగించింది. ఈ గడువును అక్టోబర్ 2022 దాకా పెంచింది. అంతకు ముందు మార్చి 2022ను గడువుగా ప్రకటించినప్పటికీ, రికరింగ్ డిజిటల్ పేమెంట్ల రూల్స్ మార్పుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశంలోని డెవలపర్లతో కలిసి పనిచేయడంతోపాటు, ముందంజ వేయడానికి గూగుల్ ఎప్పుడూ రెడీగానే ఉంటుందని ఆ కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. గూగుల్ ప్లే స్టోర్ బిల్లింగ్ సిస్టమ్పై ఇండియా డెవలపర్లు గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తన బిల్లింగ్ సిస్టమ్ను వాడుకునే డిజిటల్ సర్వీసులను అమ్మాలని మన డెవలపర్లకు గూగుల్ ఆంక్షలు పెట్టింది. ఇందుకోసం కొంత పర్సంటేజిని తమకు చెల్లించాలని నిర్దేశించింది. యాప్ల డౌన్లోడ్కు డబ్బు వసూలు చేసే డెవలపర్లకు మాత్రమే తమ రూల్ వర్తిస్తుందని, గూగుల్ ప్లే స్టోర్లోని మూడు శాతం డెవలపర్లు మాత్రమే దీనికింద కవర్ అవుతారని గూగుల్ చెబుతోంది. ఈ కమిషన్ ఫీని గతంలోని 30 శాతం నుంచి ఈ ఏడాదే 15 శాతానికి గూగుల్ తగ్గించింది. గూగుల్ డెడ్లైన్ పొడగింపు డెవలపర్లకు కొంత రిలీఫ్ ఇస్తుందని అలయన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్ (ఏడీఐఎఫ్) తెలిపింది. కాకపోతే, గడువు పొడగింపునకు గూగుల్ చెబుతున్న కారణాలను తాము అంగీకరించడం లేదని స్పష్టం చేసింది. డెవలపర్ల ముందున్న ప్రధాన సమస్య 15 శాతం ఫీ చెల్లింపేనని పేర్కొంది. గూగుల్ మాత్రం దీనిని గుర్తించడానికి ఒప్పుకోవడం లేదని ఏడీఐఎఫ్ విమర్శించింది. డెవలపర్లను మెప్పించలేక, కంటి తుడుపు చర్యగా డెడ్లైన్ పొడగింపును గూగుల్ ఎంచుకుందని పేర్కొంది.
