
ముంబై: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)ను ఐపీఓకు తీసుకెళ్లాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఎల్ఐసీ ఐపీఓపై చర్చలు ప్రారంభదశలోనే ఉన్నాయని, త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. పబ్లిక్ లిస్టింగ్ కోసం ఎల్ఐసీ చట్టంలో సవరణలు తేవడంపైనా ప్రభుత్వం న్యాయసలహా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఐపీఓతో రెండు లాభాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. లిస్టింగ్ వల్ల సంస్థ సామర్థ్యం, పారదర్శకత పెరుగుతుందని, లాభదాయకత మరింత మెరుగుపడుతుందని అంచనా వేస్తోంది. ఐపీఓల వల్ల జరిగే మంచిచెడులను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్), డీఎఫ్ఎస్లు బేరీజు వేస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లొంబార్డ్, జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి కంపెనీలు ఇది వరకే దలాల్స్ట్రీట్కు వెళ్లాయి. ఈ ఏడాది జూన్ లెక్కల ప్రకారం ఎల్ఐసీ కొత్త ప్రీమియాల విలువ రెండింతలు పెరిగి రూ.26 వేల కోట్లకు చేరింది. గత జూన్లో ఇది రూ.11 వేల కోట్లు. దీంతో ఎల్ఐసీ మార్కెట్ షేరు 74 శాతానికి చేరింది. ఇది ఐపీఓకు వస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్లను అధిగమించి మొదటిస్థానంలో నిలుస్తుంది.