- బల్దియా స్పోర్ట్స్ వింగ్లో కోచ్ల కొరత
- 3 సార్లు ప్రపోజల్స్ పంపినా స్పందించని సర్కార్
- సిటీ గ్రౌండ్లలో ఎక్కడా రెగ్యులర్ కోచ్ లేరు
- ఉన్న 77 మంది పార్ట్టైమ్గా పని చేస్తున్న వారే
- ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయిస్తున్న యువత
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ విభాగంలో కోచ్ల కొరత తీవ్రమైంది. గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 521 ప్లే గ్రౌండ్స్ఉండగా ఇందులో 97చోట్ల 30 రకాల ఆటలకు బల్దియా ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం రెగ్యులర్ కోచ్లను నియమించకపోవడంతో ఆ ప్రభావం క్రీడాకారులపై పడుతోంది. సిటీ వ్యాప్తంగా ఉన్న గ్రౌండ్లలో కేవలం 77 మంది కోచ్లు మాత్రమే ఉన్నారు. వీరంతా పార్ట్టైం పద్ధతిలో పనిచేస్తున్నారు. క్రీడాకారుడు తయారుకావడంలో కోచింగ్ ఎంతో కీలకం. కానీ ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నాం.. యువతను ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు రాజధాని లోని గ్రౌండ్లను పట్టించుకోవడం లేదు.
దీంతో మెంబర్షిప్ తీసుకున్న యువకులు ఎవరికి వారు వచ్చి ఆడుకొని వెళ్తున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని ఆటల్లో రాణించాలి అనుకుంటున్న వారి ఆశ నెరవేరడం లేదు. ఆడే సత్తా ఉన్నప్పటికీ గ్సౌండ్స్, సౌకర్యాల కొరతతో చాలా మంది వెలుగులోకి రావడం లేదు. ఉత్తమ క్రీడాకారులను తయారు చేయాల్సిన జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ విభాగం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. కోచింగ్ ఇచ్చేందుకు వలంటీర్లను నియమిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నప్పటికీ ఆ విషయంపై క్లారిటీ లేదు. విక్టోరియా ప్లే గ్రౌండ్, అంబర్ పేట, మొఘల్పురా వంటి గ్రౌండ్లలో కోచ్లు లేరని పలువురు కార్పొరేటర్లు ఇటీవల జరిగిన కౌన్సిల్ మీటింగ్లో నిలదీశారు.
కేటగిరీని బట్టి..
కోచ్లు కావాలని జీహెచ్ఎంసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే మూడు సార్లు ప్రతిపాదనలు పంపినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. 134 మంది రెగ్యులర్ కోచ్ల అవసరం ఉందని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. పార్ట్ టైమ్ కోచ్లు వివిధ కేటగిరీల కింద ఉదయం 6 గంటల నుంచి 9 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 వరకు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి కేటగిరీని బట్టి నెలకు రూ.14వేలు, రూ.10,500, రూ.8,750 వేతనాలను బల్దియా అందిస్తోంది.
జోన్ల వారీగా..
ఎల్బీనగర్ జోన్లో 69, ఖైరతాబాద్లో 144, చార్మినార్లో 101, శేరిలింగంపల్లిలో 56, కూకట్పల్లిలో 61, సికింద్రాబాద్లో 90 ఇలా మొత్తం 521 గ్రౌండ్లు ఉన్నాయి. వీటిలో ఎల్బీనగర్లో 10, ఖైరతాబాద్ 20, చార్మినార్ 31, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లలో 19, సికింద్రాబాద్ 17 మొత్తం 97 గ్రౌండ్లలో 30 రకాల క్రీడలకు జీహెచ్ఎంసీ శిక్షణ ఇస్తోంది. అయితే ఇన్స్పెక్టర్లు, పీసీసీల పేరుతో ఇన్చార్జ్లు ఉన్నారే తప్ప సిటీలో ఎక్కడా కూడా పర్మినెంట్ కోచ్లు లేరు. నేషనల్ గేమ్ హాకీ కోసం కేవలం నాలుగు గ్రౌండ్లు మాత్రమే ఉన్నాయి. కబడ్డీకి కూడా 4 గ్రౌండ్లు మాత్రమే ఉన్నాయి. బాక్సింగ్ రింగ్ఊసే లేదు.