బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్డీఏ, మహాఘట్బంధన్ కూటముల మధ్య ప్రధాన పోరు కనిపిస్తోంది. మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం అభ్యర్థిగా విఐపి పార్టీ అధ్యక్షుడు ముఖేశ్ సహానీని ప్రకటించింది. కానీ, నితీశ్ కుమార్- నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ మాత్రం సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార ఎన్డీఏ మరోసారి అధికారం చేపడుతుందా? లేక తేజస్వి యాదవ్- రాహుల్ గాంధీ నేతృత్వంలోని మహాఘట్బంధన్ సత్తా చాటుతుందా? అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికర ప్రశ్నగా మారింది.
గత 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కూటమిగా పోటీచేశాయి. ఆర్జేడీ 23.08% ఓట్లుతో 75 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించగా బీజేపీ 19.46% ఓట్లతో 74 సీట్లు గెలిచింది. జేడీయూ 15.40% ఓట్లతో 43 సీట్లు, కాంగ్రెస్ 9.49% ఓట్లతో కేవలం 19 సీట్లు మాత్రమే సాధించింది. వామపక్షాలు 16, మాంఝీ పార్టీ 4, బీఎస్పీ 1, ఏఐఎంఐఎం 5 స్థానాలు గెలిచాయి. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో బిహార్లో రాజకీయ అనిశ్చితి, సంకీర్ణ ప్రభుత్వాల అస్థిరత కొనసాగింది. ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తుపెట్టుకొన్న జేడీయూ అధినేత నితీశ్ కుమార్, ఫలితాల అనంతరం ఆర్జేడీతో కూటమిగా జతకట్టి మోదీ–అమిత్ షాలకు షాక్ ఇచ్చారు. అయితే
కొంతకాలానికే ఆర్జేడీతో విభేదాలు తలెత్తడంతో మళ్లీ బీజేపీతో చేతులు కలిపి ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్నారు. బిహార్ రాజకీయాల్లో ‘పల్టూరామ్’గా
పేరుగాంచిన నితీశ్ కుమార్ తన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలతో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచినాసరే, ఆ పార్టీల మద్దతుతో తానే ముఖ్యమంత్రిగా కొనసాగడం అలవాటుగా మారింది. ఈసారి ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ వస్తే, నితీశ్ కుమార్ మళ్ళీ సీఎం అవుతారా? లేదంటే అనారోగ్యం, వృద్ధాప్యం వంటి కారణాలవల్ల సీఎం పీఠాన్ని బీజేపీకి అప్పగించి తన కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తారా? అన్నది ఓటర్ల తీర్పుపైనే ఆధారపడి ఉంది.
సీట్ల సర్దుబాటు పూర్తి
ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటు సజావుగా పూర్తయింది. బీజేపీ 101, జేడీయూ 101, ఎల్జేపీ 29, ఆర్ఎల్ఎం 6, హెచ్ఎఎం 6 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మహాఘట్బంధన్లో ఆర్జేడీ 143, కాంగ్రెస్ 55, సీపీఐ ఎంఎల్ 20, సీపీఐ 6, సీపీఎం 4, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) 15 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ, ఆప్ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తుండగా, చివరి నిమిషంలో జేఎంఎం ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించింది.
నితీశ్ 20 ఏండ్ల పాలనపై కొంత వ్యతిరేకత పెరిగినట్లే!
ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు తమ ప్రచారాన్ని పూర్తిగా సీఎం నితీశ్ కుమార్ వ్యక్తిత్వం, పరిపాలనపై కేంద్రీకరించారు. బిహార్ వెనుకబాటుకు నితీశ్ పాలనే ప్రధాన కారణమని విమర్శిస్తూ, అవినీతి, నిరుద్యోగం, రైతు సమస్యలు, వలసలు, ధరల పెరుగుదల వంటి అంశాలతోపాటు, మహిళలకు భద్రత కల్పించడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శిస్తున్నారు. ఇక రెండు దశాబ్దాలుగా సీఎంగా కొనసాగుతున్న నితీశ్ ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత ఈసారి ఎన్డీఏకు సవాలుగా మారవచ్చు. వలసలు, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, అవినీతి ఆరోపణలు, మౌలిక వసతుల కల్పించడంలో విఫలం వంటి అంశాలు ఓటింగ్ నాటికి ప్రజా వ్యతిరేకతను పెంచే అవకాశముంది. అయితే, క్షేత్రస్థాయిలో బీజేపీ బలపడటం, మోదీ ప్రజాదరణ, కేంద్ర పథకాల ప్రభావం వల్ల ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తుందనే విశ్వాసంతో కమలనాథులు ఉన్నారు.
‘ఓట్ చోరీ’తో బీజేపీకి నష్టం
బిహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై వివాదం చెలరేగింది. బీజేపీకి అనుకూలంగా ఓట్లు టాంపరింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ‘ఓటు చోరీ’ ఆరోపణలు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపైనే కాదు, కేంద్ర ఎన్నికల కమిషన్ స్వతంత్రతపైనా ప్రశ్నలు లేవనెత్తాయి. ‘ఓట్ చోరీ’ యాత్రతో రాహుల్ గాంధీ ఇప్పటికే బిహార్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఎన్నికల కమిషన్, బీజేపీపై అయన చేసిన ఆరోపణలు జేడీయూ, బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది.
ప్రశాంత్ వ్యూహం ఫలించేనా?
ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ స్థాపించి ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగారు. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఉపాధి అవకాశాల కల్పన, వలసల నియంత్రణ వంటి ప్రజా సమస్యల పరిష్కారానికే తన ప్రధాన అజెండాగా ముందుకు తీసుకొచ్చారు. ముఖ్యంగా యువత, విద్యావంతుల ఓట్లను ఆకర్షించేందుకు ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ సుమారు 11% ఓట్లు సాధించే అవకాశముందని ముందస్తు అంచనాలున్నాయి. అదే నిజమైతే ఏ కూటమికీ స్పష్టమైన మెజార్టీ రాకపోతే పీకే ఈసారి బిహార్ రాజకీయాల్లో ‘కింగ్ మేకర్’గా అవతరించే అవకాశం ఉండొచ్చు.
ఉపాధికే ప్రాధాన్యం ఇస్తున్న ప్రజలు
రెండు దశాబ్దాలకుపైగా నితీశ్కుమార్ సీఎంగా కొసాగుతున్నా బిహార్ ఇంకా అత్యంత వెనుకబడిన రాష్ట్రంగానే ఉంది. పేదరికం, నిరుద్యోగం వలసలు పెరిగాయి. పట్టణ, గ్రామీణ మధ్య ప్రాంతాల మధ్య ఆర్థిక అంతరాలు పెరిగాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ప్రజల్లో అసంతృప్తి రగులుతుండగా, విద్య, వైద్యం, ఉద్యోగాల కల్పన, ఉపాధి రంగాల్లో పెద్ద గణనీయమైన మార్పులేమి కనిపించడంలేదు. ఎన్నికల వేళ ఎన్డీఏ, మహాఘట్బంధన్ కూటములు ప్రకటిస్తున్న సంక్షేమ హామీలు, ఉచిత పథకాలు, ఆర్థిక ఉద్దీపన పథకాలు ఓటర్లను ఎంతవరకు ఆకర్షిస్తాయో చూడాలి. మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో బిహార్ ఓటర్లు కులాల ప్రాతిపదికన ఓటు వేస్తారా? లేక విద్య, వైద్యం, అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, ఉపాధి వంటి ప్రజా అంశాలకు ప్రాధాన్యం ఇస్తారా అన్న ప్రశ్నకు రాబోయే ఎన్నికల ఫలితాలే సమాధానం
ఇవ్వనున్నాయి.
కులాల వారీగాఓట్లు పోలయ్యేనా?
దేశ చరిత్రలో తొలిసారిగా నితీశ్ ప్రభుత్వం విడుదల చేసిన కుల గణాంకాల ప్రకారం రాష్ట్రం మొత్తం 13.07 కోట్ల జనాభాలో బీసీలు 63%, ఎస్సీలు 19.65%, ఎస్టీలు 1.68%, జనరల్ వర్గం 15.52%గా ఉన్నారు. బిహార్ రాజకీయాల్లో కులాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఓటింగ్ ప్రక్రియలో ఒకప్పుడు అగ్రకులాల ఓట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. అయితే, ఇప్పుడు దళితులు, ముస్లింలు, అత్యంత వెనుకబడిన (ఎంబీసీ) కులాల ఆధిపత్యం ఎన్నికల్లో పెరిగింది. ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా ఈ వర్గాల ఓట్లు నిర్ణయాత్మకంగా మారనున్నాయి. యాదవులు, దళితులు, ముస్లింల ఓట్లు సంప్రదాయంగా ఆర్జేడీ, కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశముంది. దళితుల ఓట్లు 38 ఎస్సీ రిజర్వుడు స్థానాలతోపాటు, మిగతా అన్నిచోట్లా అత్యంత కీలకం కానున్నాయి.నితీశ్ కుర్మీ కులానికి చెందినవాడు కావడంతో కుర్మీలతో పాటు పస్మాందా ముస్లింల ఓట్లు జేడీయూకు మళ్లే అవకాశం ఉంది. కాయస్థ, రాజ్పూత్, భూమిహార్, బ్రాహ్మణ కులాల ఓట్లు ఏ కూటమి పక్షాన మళ్లుతాయన్నది కీలకం. ఇంతకాలం జేడీయూకు మద్దతిచ్చిన ధనుక్ కులస్తులు ఈసారి ఆర్జేడీ వైపు మొగ్గు చూపుతారని అంచనా. కారణం ధనుక్ కులానికి చెందిన మంగనిలాల్ మండల్ ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులవడం వల్ల ఆర్జేడీ అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ) ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉంటుంది.
- డా.చెట్టుపల్లి మల్లిఖార్జున్,
పొలిటికల్ ఎనలిస్ట్
