పంట నష్టంపై స్పందించని సర్కారు

పంట నష్టంపై స్పందించని సర్కారు
  • దెబ్బతిన్న పత్తి, పసుపు, కంది, వరి.. మట్టితో సహా కొట్టుకు పోయిన పంటలు
  • ఇంత నష్టం ఎప్పుడూ లేదంటున్న రైతులు
  • ఇప్పటి దాకా 15లక్షల ఎకరాలకు దెబ్బ
  •  నష్టం అంచనా వేయని అగ్రికల్చర్‌‌ డిపార్ట్​మెంట్​

హైదరాబాద్‌‌, వెలుగు : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాలకు పైగా పంటలపై ఎఫెక్ట్‌‌ పడింది. ప్రధానంగా పత్తి, సోయా, మక్కలు, పెసర్లు, మినుములు, వరి పొలాలు దెబ్బతిన్నాయి. గత నెలలో కురిసిన వర్షాలకు గోదావరి నదీ తీర ప్రాంతాల్లోని జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. తాజాగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌‌ పరిసర జిల్లాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు చాలా నష్టపోయారు. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో పంటలకు నష్టం జరిగినా సర్కారులో ఎలాంటి చలనం లేదు. క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇయ్యాల్సిన అధికారులు.. ఇప్పటి దాకా  కనీసం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

మట్టితో సహా  కొట్టుకుపోయిన పంటలు...

తాజాగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌‌ పరిసర జిల్లాల్లోని పంటలు భారీగా దెబ్బతిన్నాయి.  రంగారెడ్డి, వికారాబాద్‌‌, తాండూరు, చేవెళ్ల, పరిగి తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున పంట నష్టం  జరిగింది. పరిగి మండలంలోని నష్కల్‌‌,  రుకుంపల్లి, గొట్టిముక్కుల గ్రామాల్లో పంట చేన్లన్నీ మట్టితో సహా కొట్టుకుపోయాయి. ఈ గ్రామాల పరిధిలోనే 10వేల ఎకరాల్లో పత్తి, మక్క, కంది, పసుపు, వరి పంటలు నామరూపాల్లేకుండా పోయాయి. గురువారం సాయంత్రం రెండు గంటల పాటు భారీగా వాన పడటంతో  చాలా ఎఫెక్ట్‌‌ అయినట్టు నష్కల్‌‌ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలమంతా రాళ్లతో నిండిపోయిందని, జేసీబీతో క్లీన్​ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. 

పత్తి, కంది, పసుపు, వరి పంటలలకు ఎఫెక్ట్‌‌...

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి దాకా 85లక్షల ఎకరాలకు పైగా సాగు జరిగింది.  ఇప్పటికే వేసిన పంటలపై వర్షాలు ప్రతికూల ప్రభావం చూపగా.. తాజాగా కురుస్తున్న వానలతో తీవ్ర నష్టం జరుగుతోంది. 45.42లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. గత నెలలో కురిసిన వర్షాలకు దాదాపు 12లక్షల ఎకరాల్లో  పత్తి చేన్లు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాల్లో తేలింది.  వానల ప్రభావంతో గోదావరి నదీ పరిసర ప్రాంతాల్లోని ఆదిలాబాద్‌‌, ఆసిఫాబాద్​, నిర్మల్‌‌, నిజామాబాద్‌‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి,  ములుగు, వరంగల్‌‌, మహబూబాబాద్‌‌, భద్రాద్రి, తదితర జిల్లాల్లో పత్తి పంటపై భారీగా  ఎఫెక్ట్‌‌ పడింది.  సోయాబీన్‌‌ 3.49 లక్షల ఎకరాల్లో సాగైంది. కంది 5.17లక్షల ఎకరాలు, మొక్కజొన్న 4.21లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. మరో 20లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. వర్షాలు, వరదలకు 15లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు  ప్రాథమిక అంచనాలున్నాయి.  రాష్ట్రంలో పంటల బీమా, వాతావరణ ఆధారిత బీమా మూడేండ్లుగా అమలు చేయడం లేదు. దీంతో పంట నష్టానికి పరిహారం అందే చాన్స్​ లేకుండా పోయింది. నష్టం అంచనా వేయడంలో అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​ అధికారుల నిర్లక్ష్యంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

పెట్టుబడి నీటిపాలు 

నా వయస్సు 95 ఏండ్లు. ఇప్పటి దాకా గిట్ల వాన పడుడు చూడలే. 1981లో గిట్లనే వానలు వచ్చినయ్‌‌ కానీ ఇంత పంట దెబ్బతినలేదు. వానలకు ఊర్లు, పంట చేన్లన్నీ కొట్టుకుపోయినయ్‌‌. పెట్టిన పెట్టుబడి అంతా నీటి పాలైంది. మళ్లీ పంట వేసుకుందామంటే.. నష్టం వస్తుందేమో అని బుగులు అవుతాంది. అధికారులు వచ్చి పంట నష్టం అంచనా వేసి ఆర్థిక సాయం చేయాలే..

- కొండా చంద్రారెడ్డి, వికారాబాద్‌‌ జిల్లా

పంటంతా కొట్టుకుపోయింది.. 

పరిగి మండలంలో గురువారం సాయంత్రం సునామీలాగా  2 గంటలు నీళ్లు కుమ్మరించినట్లు వాన కొట్టింది. దీంతో పంట చేన్లన్నీ  కొట్టుకుపోయాయి. మా ఊరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పదివేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. మా కుటుంబానికి చెందిన 60 ఎకరాల పంట పూర్తిగా దెబ్బతిన్నది. మళ్లీ పంట వేసుకోలేకుండా మట్టితో సహా కొట్టుకుపోయాయి. ఇది మాకు తీరని నష్టం. ‌‌‌‌

- లక్ష్మీకాంత్‌‌, రైతు, నష్కల్‌‌ గ్రామం, పరిగి, వికారాబాద్‌‌ జిల్లా