హైదరాబాద్, వెలుగు: బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ మాత్రమే విన్నాం. ఇప్పుడు రాష్ట్రంలో గొర్రెలకు కూడా హాస్టల్స్ వస్తున్నాయి. పౌల్ట్రీ రంగంలో జరిగిన అభివృద్ధి తరహాలోనే గొర్రెల పెంపకంలోనూ కొత్త పద్ధతులు పాటించేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తోంది. మోడ్రన్ ట్రెండ్కు తగినట్లు సదుపాయలు కల్పించేందుకు షీప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గ్రామాల్లో సామూహిక గొర్రెల సంరక్షణ కోసం ప్రత్యేకంగా షీప్ హాస్టళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతోంది.
ఉపాధి హామీ నిధులతోనే షెడ్లు
రాష్ట్రంలో కురుమ, యాదవ సామాజిక వర్గాల ఆర్థిక అభివృద్ధికి సర్కారు గొర్రెలు పంపిణీ చేపట్టిన విషయం తెలిసిందే. గ్రామాల్లో ఒక కుటుంబానికి 21 గొర్రెలు అందిస్తే వాటిని సంరక్షించుకోవడం కష్టతరంగా మారుతోంది. దీంతో సామూహికంగా గొర్రెలను సంరక్షించుకునేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో షీప్ హాస్టల్స్ పేరుతో షెడ్ల నిర్మాణాలు చేపడుతోంది. కురుమ, యాదవ కుటుంబాలకు చెందినవాళ్ల గొర్రెల కోసం ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెండు ఎకరాలదాకా స్థలాన్ని సేకరిస్తోంది. సేకరరించిన స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించి గొర్రెల కాపరుల కోసం ప్రత్యేకంగా షెడ్లు నిర్మిస్తోంది. షెడ్డు ముందు జాలీలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుండటంతో దొంగల బెడద, వేటకుక్కలు, తోడేళ్ల భయం లేకుండా రక్షణ ఉండనుంది. షెడ్డులో వసతి, నీటి సౌలత్, ఎండ, వాన, చలి నుంచి రక్షణకు తగిన చర్యలు చేపట్టారు. ఈ షెడ్డుకు రాత్రంతా కాపలాగా విడతల వారిగా బాధ్యతలు తీసుకునే అవకాశాలున్నాయి. ఈ వసతి గృహాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పైలెట్ ప్రాజెక్టు కింద సిద్దిపేటలో 12 షెడ్లు
ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట జిల్లాలోని 10 గ్రామాల్లో షీప్ హాస్టల్స్ పేరుతో గొర్రెల షెడ్ల నిర్మించారు. మరో 2 గ్రామాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఉపాధి పథకం కింద వంద శాతం రాయితీపై లక్షలాది రూపాయల నిధులు వెచ్చించారు. 6 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు, రెండున్నర మీటర్ల ఎత్తుతో పాకలను నిర్మించారు. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కొడువటూరులో షెడ్డు నిర్మించారు. జగిత్యాల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్లో, సిరిసిల్ల జిల్లాలోని మిట్టపల్లి, నర్సాపూర్ గ్రామాల్లోనూ సామూహిక గొర్రెల షెడ్లు నిర్మించారు. కాగా, రాష్ట్రంలోని 8109 గ్రామాల్లో గొర్రెల పెంపకందార్ల సొసైటీల్లో 7,61,896 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతీ గ్రామంలో గొర్రెల షెడ్లు కట్టించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
జిల్లాకు 40 దాకా నిర్మిస్తం
రాష్ట్రవ్యాప్తంగా షీప్ హాస్టల్స్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నం. డీపీఆర్ రూపొందించి త్వరలో జిల్లాకు కనీసం 30 నుంచి 40 షెడ్ల నిర్మాణానికి కసరత్తు చేస్తున్నం. కొత్త పద్ధతుల్లో గొర్రెలకు రక్షణ కల్పించేందుకు కృషి చేస్తున్నం. - దూదిమెట్ల బాల్రాజ్ యాదవ్, చైర్మన్, షీప్ ఫెడరేషన్
అన్ని గ్రామాల్లో షీప్ హాస్టల్ పెట్టాలి
షీప్ హాస్టళ్ల ఏర్పాటుకు ఉపాధి హామీ నిధులతో ఆటంకం కలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో షెడ్లు నిర్మించాలి. ప్రతి గ్రామంలో గొర్రెల షెడ్లు, రక్షణ ఏర్పాట్లు, నీటి తొట్లు ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాలు పెడితే మరింత భద్రత ఉంటుంది.- ఉడుత రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గొర్రెల పెంపకందార్ల సంఘం