- డబుల్ బెడ్రూం ఇండ్లపై సర్కారు యోచన
- జీహెచ్ఎంసీ ఎన్నికల టైంలో ఇస్తే లాభమని భావన
- పనులు వేగం చేయాలని ఇటీవల సీఎం ఆదేశం
- 90% పూర్తయిన 50 వేల డబుల్బెడ్రూం ఇండ్లు
- కొల్లూరు మెగా ప్రాజెక్ట్ దాదాపు పూర్తి
- దేశంలోనే పెద్దదంటున్న అధికారులు
- కాంట్రాక్టర్లకు రూ.900 కోట్ల బిల్లులు పెండింగ్
- మరో లక్ష ఇండ్లుకూ ఎన్నికల ప్రచారంలో హామీ?
హైదరాబాద్ , వెలుగు:
జీహెచ్ఎంసీ ఎన్నికల ముందే గ్రేటర్ పరిధిలోని డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించాలని సర్కారు భావిస్తోంది. ఎన్నికల టైంలో లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తే తామూ ఎన్నికల్లో లాభపడొచ్చన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో లక్షా 80 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను కడుతున్న ప్రభుత్వం, ఒక్క గ్రేటర్ పరిధిలోనే లక్ష ఇళ్లను నిర్మిస్తోంది. వాటిలో దాదాపు 50 వేల ఇళ్లు చివరి దశకు చేరుకున్నాయి. ఇటీవల కలెక్టర్ల సమావేశం, కేబినెట్ భేటీల్లో డబుల్ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు.ప్రత్యేకించి గ్రేటర్లో కడుతున్న వాటిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, వీలైనంత తొందరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందిగా సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే, మూడు లేదా ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలోనూ సర్కారున్నట్టు తెలుస్తోంది.
కొల్లూరులో మెగా ప్రాజెక్టు
పటాన్చెరు శివారులోని కొల్లూరులో ప్రభుత్వం ఓ మెగా ప్రాజెక్ట్ కడుతోంది. 124 ఎకరాల్లో 117 బ్లాకులతో 15,660 డబుల్ బెడ్రూం ఇళ్లను కడుతోంది. దానికి రూ.1,354.59 కోట్లు ఖర్చు పెడుతోంది. ఈ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది. ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, మౌలిక వసతులకు సంబంధించిన పనులు నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్దదని ఆర్అండ్ బీ అధికారులు చెబుతున్నారు. సూపర్మార్కెట్లు, పెట్రోల్ బంక్, జిమ్, ఆడిటోరియం, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, స్కూల్, కాలేజీ, బస్టాప్, పోలీస్స్టేషన్, ఫైర్స్టేషన్, ఎస్టీపీ, సోలార్పవర్ వంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గండిమైసమ్మ సర్కిల్, దుండిగల్, బౌరంపేట వద్ద 5 వేలకు పైగా ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇవీ చివరి దశలోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, డబుల్ ఇళ్ల నిర్మాణానికి పెండింగ్ బిల్లులు అడ్డంకిగా మారాయి. కాంట్రాక్టర్లకు టైమ్కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయి. రాష్ట్రమంతా కలిపి రూ.1,500 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉండగా, ఒక్క గ్రేటర్ పరిధిలోనే రూ.900 కోట్లు పెండింగ్లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఇంకో లక్ష ఇళ్లు?
ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో నిర్మిస్తున్న లక్ష ఇళ్లకు తోడు, మరో లక్ష ఇళ్లకు ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇవ్వబోతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఈ విషయంపై జీహెచ్ఎంసీ అధికారులకు సర్కారు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. జంటనగరాల పరిధిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, వాటిలో ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలకు సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. ఇక, గ్రేటర్లో డబుల్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 5 లక్షలు దాటింది. ఇప్పటికీ ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాల్లోనూ అప్లికేషన్లు తీసుకోవాల్సిందిగా ప్రజలు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో మీసేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.
చివరి దశలో నిర్మాణాలు
గ్రేటర్ పరిధిలో ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇప్పటిదాకా 8 వేల ఇళ్లు పూర్తయ్యాయన్నారు. మరో 50 వేల ఇళ్లు 85 శాతంపైగా కంప్లీట్ అయ్యాయని చెప్పారు. కొల్లూరులో 15 వేల ఇళ్ల నిర్మాణం చివరి దశకు చేరుకుందన్నారు. కుత్బుల్లాపూర్, దుండిగల్, రాంపల్లి, కుర్మగూడ ప్రాంతాల్లో ఒక్కోచోట 2 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందన్నారు. పెండింగ్లో ఉన్న రూ.900 కోట్ల బిల్లులను త్వరలోనే హౌసింగ్ శాఖ విడుదల చేస్తుందన్నారు.